వై నాట్ జగన్ ? ఈసీపై రాహుల్ అటాక్ నేపథ్యంలో చర్చ..!
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రాహుల్ గాంధీ ఓట్ల చోరీ ఆరోపణలపై చర్చ జరుగుతోంది. కర్నాటక అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో భారీ ఎత్తున ఓటర్ల జాబితాలో చేర్చిన నకిలీ ఓట్లను బయటపెట్టిన రాహుల్ గాంధీ.. దేశంలో కీలక చర్చకు తెరలేపారు. బీజేపీని ఎన్నికల్లో గెలిపించేందుకు ఎన్నికల సంఘం ఉద్దేశపూర్వకంగా ఇలా అక్రమంగా నకిలీ ఓట్లను చేరుస్తోందని ఆయన ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణల్ని ఈసీ, బీజేపీ తోసిపుచ్చుతున్నాయి.
అయితే ఇదే సమయంలో గతంలో ఏపీలో విపక్ష వైసీపీ కూడా పలుమార్లు ఇలాంటి ఆరోపణలే చేసిన విషయాన్ని జనం, ఆ పార్టీ కార్యకర్తలు గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ ఆధారాలతో సహా చేసిన ఓట్ల చోరీ ఆరోపణల తరహాలోనే గతంలో వైసీపీ అధినేత జగన్ తో పాటు ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు ఆరోపణలు చేశారు. ఇప్పుడు రాహుల్ ఆరోపణలతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ వైఎస్ జగన్ కానీ ఆ పార్టీ నేతలు కానీ తమ ఆరోపణల్ని మరోసారి జనంలోకి తెస్తే వాటిపైనా చర్చ జరిగే అవకాశం ఉంది.

కానీ జగన్ కానీ వైసీపీ నేతలు కానీ రాహుల్ ఆరోపణలపై మౌనంగా ఉండిపోతున్నారు. ఓవైపు రాహుల్ గాంధీ ఆరోపణలపై అధికార బీజేపీతో పాటు ఎన్డీయే, ఇండియా కూటమిలోని పార్టీలన్నీ ఏదో విధంగా స్పందిస్తున్నాయి. కానీ ఈ రెండు కూటముల్లోనూ లేని వైసీపీ మాత్రం వీటిపై మౌనం వహిస్తోంది. గతంలో తాము చేసిన ఆరోపణలు, ఈసీ, హైకోర్టుకు సమర్పించిన ఆధారాలను తిరిగి బయటపెట్టేందుకు ఇంతకన్నా మంచి అవకాశం రాదు. అయినా వైసీపీ మౌనంగానే ఉండిపోతోంది.

దీని వెనుక బీజేపీతో ఆ పార్టీకి ఉన్న రహస్య బంధమే కారణమా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్ సహా ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు ఉన్నప్పటికీ, మద్యం స్కాంలో ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో ఆయా సంస్థలు మౌనంగా ఉండిపోతున్నాయి. దీంతో జగన్ కేసులతో పాటు వివేకా హత్య, ఇతర కేసుల్లోనూ దర్యాప్తులు నత్తనడకన సాగుతున్నాయి. ఇలాంటి పరిస్ధితుల్లో ఇప్పుడు తాను ఈసీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తే కేంద్రం ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందన్న భయమే జగన్ ను వెంటాడుతోందా అన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications