'పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గారో తెలియదు, బాబు-కెసిఆర్ మాట్లాడాలి'
హైదరాబాద్: తమిళనాడులో తెలుగు భాష పరిరక్షణకు జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడుం బిగించినట్లుగా కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయి. తమిళనాడు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పవన్ సెప్టెంబర్ నెలాఖరులో ధర్నా చేస్తారని కూడా వార్తలొచ్చాయి. అయితే, అది జరగలేదు.
పవన్ కళ్యాణ్ ఎందుకు తగ్గారనే చర్చ సాగుతోంది. ధర్నా చేస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారా? చెబితే ఎందుకు తగ్గారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కాగా, పవన్ కళ్యాణ్ ఎందుకుతగ్గారో తెలియదని, ఆయన ఉద్యమంలో పాల్గొంటే ఊపు వస్తుందని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు. తమిళనాడులో తెలుగు బోధనను కొనసాగించకపోతే ఉద్యమం తీవ్రతరం చేస్తామని సిపిఐ నేత నారాయణ అన్నారు.

తమిళనాడులో తెలుగు బోధన కొనసాగించాలంటూ ఉత్తరాల ఉద్యమం చేపడుతున్నట్లు నారాయణ చెప్పారు. తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు తమిళనాడు ప్రభుత్వంతో మాట్లాడి, అక్కడ తెలుగు బోధన కొనసాగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
తమిళనాడులో తెలుగు భాష పరిరక్షణకు పవన్ కళ్యాణ్ నడుం బిగించారని, తమిళనాడు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సెప్టెంబర్ నెలాఖరున ధర్నా చేయాలని ఆయన నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. తమిళనాడులో తెలుగు భాషా పరిరక్షణకు తెలుగు ప్రజలు ఇప్పటికే ఆందోళనలకు శ్రీకారం చుట్టారు.
తమిళనాడు ప్రభుత్వం 2006లో ప్రవేశపెట్టిన ‘నిర్బంధ తమిళం' జీవో కారణంగా మైనారిటీ భాషల విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకునేందుకు అవకాశం లేకుండాపోయింది. తమిళనాడు తెలుగు యువశక్తి సంస్థ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం చేపట్టింది.
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్లో నిరసన దీక్ష కూడా నిర్వహించింది. ఈ నేపథ్యంలో నాడు సమస్య పైన పవన్ కళ్యాణ్ ఆరా తీశారట. తమిళనాడులోని తెలుగువారికి సంఘీభావం తెలుపుతూ నెలాఖరులోపు హోసూరులో ధర్నా చేపట్టాలని నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి.












Click it and Unblock the Notifications