మోడీతో చంద్రబాబు భేటీ-జగన్ పై చూపే ప్రభావమెంత ? ఫ్లాష్ బ్యాక్ ఏం చెబుతోంది !
ఏపీ రాజకీయాల్లో వైసీపీ, టీడీపీ మధ్య సాగుతున్న పొలిటికల్ వార్ లో ఏ చిన్న ఆకస్మిక పరిణామం చోటు చేసుకున్నా దాన్ని ఇరు పార్టీలతో పాటు ప్రజలు కూడా భూతద్దంలో చూడాల్సిన పరిస్ధితి. అందులోనూ బీజేపీకి దగ్గరయ్యేందుకు నాలుగేళ్లుగా ప్రయత్నిస్తున్న చంద్రబాబుతో ప్రధాని మోడీ చేతులు కలిపారంటే అది చిన్న విషయమేమీ కాదనేలా ఏపీలో మీడియా ప్రచారం చేస్తోంది. అయితే ఇందులో వాస్తవమెంత ? మోడీ-బాబు భేటీ నిజంగానే జగన్ ను కలవరపెడుతుందా అంటే కచ్చితంగా అవుననే సమాధానం ఎవరి నుంచీ రావడం లేదు.
చంద్రబాబు-మోడీ షేక్ హ్యాండ్
నాలుగేళ్ల విరామం తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశంలో ప్రధాని మోడీని కలుసుకునే అవకాశం వచ్చింది. నీతి ఆయోగ్ సమావేశం సందర్భంగా సీఎంలతో పాటు విపక్ష నేతల్ని కూడా కలిసిన ప్రధాని మోడీ.. చంద్రబాబుకు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి కాసేపు మాట్లాడారు. దీంతో ఏపీ రాజకీయాల్లో పెనుమార్పు చోటు చేసుకున్నట్లే కనిపించింది. కానీ అది నిజంగానే సాధ్యమా కాదా అన్న దానిపైనా అంతకు మించిన చర్చలు జరుగుతున్నాయి. వచ్చే ఎన్నికలకు ఈ షేక్ హ్యాండ్ ను లింక్ చేస్తూ ఇప్పటికే పలు కథనాలు వచ్చేస్తున్నాయి.
జగన్ ను కలవరపెట్టిందా ?
నాలుగేళ్లుగా ప్రధాని మోడీతో ఎక్స్ క్లూజివ్ గా భేటీ అవుతూ వస్తున్న వైఎస్ జగన్ కు ఇప్పుడు చంద్రబాబు కూడా నిన్న మోడీతో మాటలు కలపడం సహజంగానే రుచించకపోవచ్చు. అయితే ఇది ఆయన్ను కలవరపెడుతుందా లేదా అనే దానిపై మాత్రం రాష్ట్రంలో పలు చర్చలు జరుగుతున్నా వాస్తవాలు మాత్రం కచ్చితంగా భిన్నంగానే ఉన్నాయి. ముఖ్యంగా మోడీ-బాబు భేటీ వచ్చే ఎన్నికల కోణంలో చూడాలా వద్దా అన్న దాని విషయంలో మాత్రం జగన్ పూర్తి క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు-మోడీ భేటీపై జగన్ కానీ వైసీపీ ప్రధాన నేతలు కానీ వెంటనే స్పందించలేదు.
జగన్ ధీమా అదే ?
చంద్రబాబుతో మోడీ భేటీ జగన్ పై ప్రభావం చూపుతుందా లేదా అన్న దానిపై రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నా సీఎం ధీమా మాత్రం వేరుగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ, మండలితో పాటు పార్లమెంటులోనూ భారీ మెజారిటీతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కలిగిన జగన్.. ఇప్పుడు మోడీ-బాబు భేటీతో కలవరపడాల్సిన అవసరం ఏమాత్రం కనిపించడం లేదు. అంతే కాదు చంద్రబాబుతో పోలిస్తే రాష్ట్రంలో జగన్ పరిస్ధితి ఎంతో మెరుగ్గా ఉంది. భారీ ఎత్తున అమలు చేస్తున్నసంక్షేమం జగన్ కూ, చంద్రబాబుకూ మధ్య ప్రజల్లో ఆదరణ విషయంలోనూ దూరాన్ని భారీగా పెంచేస్తోంది. దీన్ని అధిగమించడం ఇప్పట్లో చంద్రబాబుకు సాధ్యంకాకపోవచ్చనే అంచనా వైసీపీలోనే ఉంది.
ఫ్యాష్ బ్యాక్ ఏం చెబుతోంది ?
ప్రధాని మోడీ నిన్న వైసీపీ అధినేత, సీఎం జగన్ తో పాటు చంద్రబాబు, దేశంలో ఇతర ప్రతిపక్ష నేతల్ని కూడా కలుసుకున్నారు. దీంతో ఏపీలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతాయని భావిస్తున్న వారంతా ఫ్లాష్ బ్యాక్ ఓసారి గుర్తు చేసుకోవాల్సిందే. గతంలో చంద్రబాబు ఎన్డీయేకు దూరమైంది జగన్ ట్రాప్ లో పడి తప్ప మోడీ తరిమేస్తే కాదు. తనంతట తానే కాంగ్రెస్ కు దగ్గర కాలేదు కూడా. అయితే ఓసారి ఎన్డీయేకు దూరమైన తర్వాత తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో చంద్రబాబు కాంగ్రెస్ తో పాటు 22 పార్టీల్ని ఏకం చేసి మోడీపై ధర్మపోరాటం మొదలుపెట్టి చివరికి అభాసుపాలయ్యారు. అలాగే చంద్రబాబును అప్పట్లో వదులుకోవాలని బీజేపీ భావించలేదు. జగన్ ట్రాప్ లో పడి తమపై ఒత్తిడి పెంచుతున్న చంద్రబాబును నిర్లక్ష్యం చేసింది. దీంతో రాష్ట్రంలో తనపై పెరుగుతున్న ఒత్తిడిని కేంద్రంపైకి మార్చాలనుకున్న చంద్రబాబు ఎత్తులు ఫలించలేదు. కానీ ఇప్పుడు జగన్ పై అలాంటి ఒత్తిళ్లేవీ లేవు. అంతేకాదు అప్పట్లో చంద్రబాబుకు ఉన్న ఎంపీలతో పోలిస్తే భారీఎత్తున ఎంపీలు కూడా జగన్ కు ఉన్నారు. వీరిలో లోక్ సభలో ఉన్న 22 మంది 2024 వరకూ అందుబాటులో ఉంటారు. రాజ్యసభ ఎంపీలైతే ఏకంగా 2028 వరకూ పదవిలో ఉంటారు. వీరిని కాదని, జగన్ ను కాదని మోడీ ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు కుదుర్చుకునే సాహసం చేయకపోవచ్చు.