తగ్గేదేలే ! ఎట్ హోంలోనూ పలకరింపుల్లేని జగన్, చంద్రబాబు-పోరు సజీవమనే సంకేతం !
ఏపీలో పదేళ్లుగా వైఎస్ జగన్-చంద్రబాబు మధ్య మొదలైన రాజకీయ పోరు ఇప్పటికీ రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఎన్నికల్లో పరస్పరం పోటీ పడటం, ప్రత్యర్ధులపై రాజకీయ విమర్శలు చేయడం సర్వసాధారణమే అయినా జగన్ ను కాంగ్రెస్ పార్టీతో కలిసి జైలుకు పంపారన్న కోపమో, మరే ఇతర కారణమో తెలియదు కానీ చంద్రబాబుపై ఆయన కోపం మాత్రం ఇప్పటికీ యథాతథంగా ఉంది. నిన్న స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నిర్వహించిన ఎట్ హోం కార్యక్రమానికి వచ్చినా జగన్, చంద్రబాబు మాత్రం పలకరింపుల్లేకుండానే మౌనంగా ఉన్నారు.
Recommended Video


జగన్ వర్సెస్ చంద్రబాబు
ఏపీలో వైఎస్ జగన్ వర్సెస్ చంద్రబాబు పోరుకు పదేళ్లకు పైగా చరిత్ర ఉంది. గతంలో తండ్రి వైఎస్సార్ మరణం తర్వాత సీఎం కావాలనుకున్న తనను తన అనుకూల మీడియా సాయంతో భ్రష్టుపట్టించేందుకు చంద్రబాబు ప్రయత్నించారన్న కోపం జగన్ లో ఎప్పటి నుంచో ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి తన అనుకూల ఎమ్మెల్యేలను బయటికి తెచ్చి ఉప ఎన్నికల్లో పోటీ చేసి జగన్ గెలవడంతో ఈ పోరు మరింత ముదిరింది. ఆ తర్వాత జగన్ ను సీబీఐ అక్రమాస్తుల కేసుల్లో జైలుకు పంపడంలో కాంగ్రెస్ నేత శంకర్రావు, టీడీపీ నేత ఎర్రంనాయుడు కీలక పాత్ర పోషించారు. అనంతరం జగన్ వైసీపీ పార్టీ పెట్టడం, జైలుకు వెళ్లడం, కిరణ్ కుమార్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాలు పెట్టినప్పుడు ఆయన ప్రభుత్వాన్ని టీడీపీ గట్టెక్కించడం వంటి అంశాలు జగన్ లో ఆక్రోశం పెంచాయి. చివరికి 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చాక కూడా అమరావతి, పోలవరం వంటి అంశాల్లో జగన్ ను పట్టించుకోకపోవడంతో ఆ కోపం మరింత ముదిరింది. చివరికి జగన్ అసెంబ్లీని బహిష్కరించారు. జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజావేదిక కూల్చేసి చంద్రబాబును రెచ్చగొట్టారు. మూడు రాజధానులంటూ చంద్రబాబు అమరావతిలో చిచ్చు పెట్టారు. చివరికి చంద్రబాబు అసెంబ్లీని బాయ్ కాట్ చేసి బయటికి వచ్చేశారు.

ఎట్ హోంలో జగన్, చంద్రబాబు
అయితే తాజాగా స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి వైఎస్ జగన్, చంద్రబాబు ఇద్దరినీ లాంఛనంగా ఆహ్వానించారు. దీంతో వీరిద్దరూ అక్కడికి వెళ్లడం ఖాయమైంది. అదే సమయంలో జగన్, చంద్రబాబు ఒకే వేదికపైకి వస్తున్నారు కాబట్టి ఏం జరుగుతుందో చూద్దామన్న ఉత్కంఠ కూడా జనంలో పెరిగింది. కానీ అలా ఊహించిన వారందరికీ వీరిద్దరూ షాకిచ్చారు. దాదాపు గంటన్నర సేపు ఒకే చోట ఉన్నా ఎవరికి వారే అన్నట్లుగా ఉండిపోయారు.

పలకరించుకోని జగన్, బాబు
సాధారణంగా ఎట్ హోం కార్యక్రమానికి రాష్ట్రంలో అధికార గణం అంతా తరలివస్తుంది. ఇందులో పలకరింపులే ప్రధాన పాత్ర పోషిస్తాయి. గవర్నర్ సమక్షంలో సీఎం, విపక్ష నేత, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పలకరింపులు ఉంటాయి. వీరంతా కలిసి తేనీటి విందు ఆరగించడం కూడా ఆనవాయితీ. అయితే నిన్న కేవలం సీఎం జగన్ తో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే ఈ విందులో కలిసి కుటుంబాలతో కూర్చుని విందు చేశారు. చంద్రబాబు మాత్రం ఎక్కడో పార్టీ నేతలతో కలిసి దూరంగా ఉండిపోయారు. గవర్నర్ మాత్రం అతిధులందరినీ వారి టేబుల్స్ వద్దకు వెళ్లి పలకరించిన సందర్భంలో చంద్రబాబును కూడా పలకరించారు.

జగన్, చంద్రబాబు సంకేతమిదే !
గవర్నర్ ఎట్ హోం కార్యక్రమానికి హాజరైన సందర్భంగా జగన్, చంద్రబాబు ఇద్దరూ తమకు షెడ్యూల్ ప్రకారం కేటాయించిన స్ధానాల్లోనే కూర్చున్నారు. ఒకరి టేబుల్ వద్దకు మరొకరు వెళ్లలేదు. గవర్నర్ కూడా వీరిద్దరినీ అక్కడ ఏర్పాటు చేసిన స్టేజ్ వద్దకు పిలవలేదు. వీరిద్దరి వైరం తెలిసే గవర్నర్ స్టేజ్ వద్దకు ఆహ్వనించలేదా అన్న చర్చ జరిగింది. స్టేజ్ మీద కేవలం సీఎం జగన్ తో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రమే కనిపించారు. ప్రారంభంలో వందేమాతరం పాడినప్పుడు కానీ, చివర్లో జనగణమన పాడినప్పుడు కానీ గవర్నర్ తో పాటు జగన్, సీజే మాత్రమే దర్శనమిచ్చారు. చంద్రబాబు మాత్రం మిగతా అతిధుల్లాగే దూరంగా టేబుల్ పై కూర్చుని ఉండిపోయారు.
తద్వారా జగన్, చంద్రబాబు తమ పోరు ఏ స్ధాయిలో ఉందో చెప్పకనే చెప్పారు. వచ్చే ఎన్నికలకు సిద్దమవుతున్న వీరిద్దరూ తమ మధ్య ఉన్న పోరును ఎట్ హోంలోనూ ప్రదర్శించడం చర్చనీయాంశమైంది.












Click it and Unblock the Notifications