చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాసం: జగన్ ప్లానేమిటి?

హైదరాబాద్‌: తాము అవిశ్వాస తీర్మానం పెడితే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వం కూలిపోదనే విషయం ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి స్పష్టంగానే తెలుసు. అయినా ఆయన అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. దానిపై ఈ నెల 14వ తేదీన శాసనసభలో చర్చకు రానుంది.

ప్రభుత్వం పడిపోదని తెలిసీ వైయస్ జగన్ అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రతిపాదించారనేది ప్రశ్న. అయితే, ఆయన పక్కా పథకం ప్రకారమే దాన్ని ప్రతిపాదించినట్లు అర్థమవుతోంది. ఇటీవల వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి చెందిన 8 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు ఫిర్యాదు కూడా చేశారు.

వారిపై అనర్హత వేటు వేయాలని వైసిపి కోరినప్పటికీ దానిపై చర్యలు తీసుకునే విషయం స్పీకర్ మీదనే ఆధారపడి ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ నుంచి టిఆర్ఎస్‌లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై టిడిపి ఫిర్యాదు చేసినప్పటికీ స్పీకర్ జాప్యం చేస్తూ వచ్చారు. కోర్టుకు వెళ్లినా ఫలితం లేకుండా పోయింది. చివరకు మెజారిటీ శానసభ్యులు టిఆర్ఎస్‌లో చేరారు. దాంతో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని దాదాపుగా వారు అధిగమించినట్లే అయింది.

Jagan - Chandrababu

ఈ స్థితిలోనే జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారని అనిపిస్తోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా, ఓటింగ్ సందర్భంగా తప్పకుండా సభకు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేయాలని వైసిపి విప్ జారీ చేసే అవకాశం ఉంది. పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది శాసనసభ్యులకు కూడా వైసిపి విప్ జారీ చేస్తుంది.

టిడిపిలోకి ఫిరాయించిన భూమా నాగిరెడ్డి, అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి వంటి ఎనిమిది శాసనసభ్యులు విప్ విషయంలో ఎలా వ్యవహరిస్తారనేది కీలకంగా మారుతుంది. విప్‌ను ధిక్కరిస్తే వారిపై అనర్హత వేటు వేయాలనే వైసిపి డిమాండుకు బలం చేకూరుతుంది. దాని ఆధారంగా కోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ కారణంగానే జగన్ చంద్రబాబు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించారని తెలుస్తోంది.

వైసిపి నుంచి వైయస్ జగన్ సహా 67 మంది శాసనసభకు గెలిచారు. వారిలో ఎనిమిది మంది టిడిపీలో చేరారు. మరో 13 మంది ఇటీవల జగన్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కాలేదు. రోజా ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురయ్యారు. అంటే ఎనిమిది మంది పోను మిగతా శాసనసభ్యుల్లో జగన్ వెంట ఎంత మంది శాసనసభ్యులు ఉంటారనేది కూడా కచ్చితమైన లెక్క లేదు. ఆ లెక్కను తేల్చుకోవడానికి కూడా అవిశ్వాస తీర్మానం పనికి వస్తుందని జగన్ భావిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు.

మరో విషయాన్ని కూడా ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. హామీల అమలులో విఫలమైనందున చంద్రబాబు ప్రభుత్వంపై వైసిపి అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తోంది. దీని వల్ల చంద్రబాబు వైఫల్యాలపై విస్తృతంగా శాసనసభలో చర్చించడానికి వైసిపికి వీలు కలుగుతుంది.

టిడిపి గత ఎన్నికల్లో 108 స్థానాలు గెలుచుకుంది. తమ పార్టీలోకి వచ్చిన 8 మంది శాసనసభ్యుల అవసరం లేకుండానే టిడిపి అవిశ్వాస తీర్మానాన్ని గట్టెక్కగలుగుతుంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ టికెట్ మీద గెలిచి టిడిపిలోకి ఫిరాయించిన శాసనసభ్యులను లక్ష్యం చేసుకుని జగన్ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తున్నట్లు అర్థమవుతోంది.

వైసిపిని వీడి తెలుగుదేశం పార్టీలో చేరిన శాసనసభ్యులు - భూమా నాగిరెడ్డి (నంద్యాల) , అఖిలప్రియ (ఆళ్లగడ్డ), ఆదినారాయణ రెడ్డి (జమ్మలమడుగు), జలీల్‌ఖాన్ (విజయవాడ పశ్చిమ), డేవిడ్ రాజు (ఎర్రగొండపాలెం), జయరాములు (బద్వేలు), కలమట వెంకటరమణ (పాతపట్నం), మణిగాంధీ (కొడుమూరు)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+