భర్త బయటకు తీసుకెళ్లలేదని భార్య ఆత్మహత్య:చిన్న కారణాలకే చావును కోరుకుంది!
విశాఖపట్టణం:పుట్టినరోజునాడు ఎంత అడిగినా భర్త బయటకు తీసుకెళ్లలేదనే మనస్థాపంతో ఒక ఇల్లాలు బలవన్మరణానికి పాల్పడింది. దీంతో కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే వాళ్ల వివాహ బంధం ముగిసిపోయింది.
మరోవైపు మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తల్లి చనిపోయి...తండ్రి జైలుకెళ్లి వీరిద్దరి పిల్లలు అనాథలుగా మారే పరిస్థితి. మారుతున్న కాలంలో మనుషులు ఎంత చిన్న కారణాలకు బలవన్మరణానికి పాల్పడుతున్నారనేది ఈ ఉదంతం కళ్లకు కట్టింది.
మరోవైపు మధువాణిని రెండో పెళ్లి చేసుకొన్న వెంకటేశ్వరరావుకు కూడా తొలి వివాహం ద్వారా ఒక బాబు సంతానం. కానీ భార్యకి ఇతడికి పొసగక పోవడంతో ఆమె ఇతడిని వదిలేసి కొడుకును తీసుకొని వెళ్లిపోయింది. దీంతో ఇతడు నాలుగు నెలల క్రితమే మధువాణిని పెళ్లి చేసుకొన్నాడు. ఇలా వీరిద్దరూ రెండోసారైనా తమ దాంపత్యంలో మధురిమలు పండిద్దామని నూతన జీవితాన్ని ప్రారంభిద్దామని స్వస్థలం వదిలేసి న ఇద్దరూ విశాఖ జిల్లా తిమ్మరాజుపేటకు వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్నారు. వెంకటేశ్వరరావు తిమ్మరాజుపేట డావెన్సీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో టీచర్ గా పనిచేస్తుండగా ఈ దంపతులు స్కూల్ కు సమీపంలోనే అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు.
అయితే నిత్యం మధువాణితో భర్తతో కలసి సరాదాగా షికార్లు తిరుగుతూ హ్యాపిగా ఎంజాయ్ చేయాలనే మనస్తత్వం. భర్తదేమో అన్నీ ఆచితూచి ఆలోచించే మనస్తత్వం. దీంతో ఈ విషయమై వీరిద్దరి మధ్య తరుచూ వాదులాటలు జరిగేవి. ఈ నేపథ్యంలోనే భార్య మధువాణి కోరిక మేరకు భర్త వెంకటేశ్వరరావు ఈనెల 15న ఇద్దరూ సరదాగా అనకాపల్లి వెళ్లి టిఫిన్ చేసేందుకు వచ్చారు. అయితే భార్య మధువాణి ముందు ఐస్క్రీం తిని ఆ తరువాత టిఫిన్ తిందామంది. కాని భర్త అందుకు నిరాకరించి టిఫిన్ తిన్న తర్వాతే ఐస్ క్రీం కొనిస్తానని చెప్పాడు. అలా వీరిద్దరి మధ్య ఐస్క్రీం విషయమై గొడవ ప్రారంభమైంది.
అది మధువాణి పుట్టినరోజు అయిన ఆగష్టు 16 వరకూ కొనసాగుతూనే ఉంది. బర్త్ డే కాబట్టి తనను మళ్లీ బయటకు తీసుకెళ్లాలని మధువాణి భర్తను కోరింది. అయితే పాఠశాల యాజమాన్యం లీవ్ ఇవ్వలేదని, ఈ రోజు బైటకు వెళ్లడం వీలుకాదని వెంకటేశ్వరావు ఆమెతో చెప్పాడు. దీంతో ఈ విషయమై వీరిద్దరి మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకోగా ఈ ఘర్షణ తరువాతి రోజు వరకూ కొనసాగింది. దీంతో భార్య పంతంపై విసుగుచెందిన వెంకటేశ్వరరావు మధువాణి తీరును ఆమె బంధువులకు వివరించి తాను విశాఖకు వెళ్లిపోయాడు. ఆ తరువాత ఫోన్ స్పిచ్ ఆఫ్ చేసుకున్నాడు.
దీంతో భర్త తనను పట్టించుకోలేదని తీవ్ర మనస్తాపానికి గురైన మధువాణి ఇంక తాను బ్రతకడం అనవసరమని పిల్లలు దివ్య, జోసెఫ్ పడుకున్న తరువాత ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. తల్లి ఎంతకూ పడుకునేందుకు తమ వద్దకు రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె పదేళ్ల కుమారుడు గదిలోకి వెళ్లి చూసేసరికి ఆమె ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.
దీంతో బాలుడు ఇంటి యాజమానిని లేపి విషయాన్ని చెప్పాడు. ఆ తరువాత బంధువుల ద్వారా ఈ సమాచారం భర్తకు తెలియడంతో అతడు విశాఖ నుంచి తిరిగివచ్చాడు. అయితే మృతురాలి తండ్రి తుట్టా రామారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 174, 176 సెక్షన్ల కింద భర్తపై కేసు నమోదు చేశారు. అనంతరం తహసీల్దార్ రవికుమార్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించి పోస్టుమార్టం అనంతరం బంధువులకు ఆమె మృతదేహాన్ని అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.