ప్రియుడితో కలిసి భర్తను చంపేసి శవాన్ని అడవిలో పాతిపెట్టింది
కడప: భర్తను ప్రియుడితో కలిసి చంపేసిన స్వాతి ఉదంతాన్నిమరిచిపోక ముందే కడప జిల్లాలో అటువంటి సంఘటనే చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ఓ మహిళ తన భర్తను ప్రియుడితో కలిసి మట్టుబెట్టింది.
కడప జిల్లా రాజంపేట మండలం శవనవారిపల్లెలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో పాటు అతని స్నేహితులతో కలిసి ఆమె ఆ దారుణానికి పాల్పడింది.
వివాహానికి ముందే ప్రేమ వ్యవహారం..
రాజంపేట పట్టణ శివారులోని ఎన్టీఆర్నగర్లో భార్యభర్తలు శివ(25), అరుణ నివాసం ఉంటున్నారు. వారికి నాలుగేళ్ల క్రితం పెళ్లయిది. వారికి ఒక కుమారుడు ఉన్నాడు. వివాహానికి ముందు సాయిసుభాష్ అనే వ్యక్తితో అరుణ ప్రేమలో పడింది.
భర్య వద్దని చెప్పడంతో ప్లాన్...
వివాహమైన తర్వాత వారిద్దరి మధ్య సంబంధం కొనసాగుతూ వచ్చింది. దాంతో శివ చాలా సార్లు అభ్యంతరం చెప్పాడు. దీంతో భర్తను అడ్డు తొలగించుకోవడానికి అరుణ ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్ వేసింది.
విందుకు పిలిచి తాగించి..
గురువారం రాత్రి సుభాష్ తన ఇద్దరు మిత్రులు వెంకటరమణ, శ్రీనులతో కలిసి విందు పేరుతో భార్యాభర్తలిద్దరినీ సమీపంలోని తోటకు తీసుకువెళ్లాడు. అక్కడ మద్యం తాగించి విచక్షణా రహితంగా శివను కత్తులతో పొడిచి హతమార్చారు. చంపేసిన తర్వాత మృతదేహాన్ని ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లి పుల్లంపేట మండలం అన్నా సముద్రం అటవీ ప్రాంతంలో పడేశారు.
హత్య గుట్టు రట్టు ఇలా..
శివ కనిపించకపోవటంతో అనుమానంతో మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో శుక్రవారం పోలీసులు అరుణ, సాయిసుభాష్లను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో గుట్టు రట్టయింది. నిందితులతో కలిసి పోలీసులు మృతదేహం కోసం గాలించారు. శవం అటవీ ప్రాంతంలో వెలుగుచూసింది. ఈ కేసులోని మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.