బీజేపీపై చంద్రబాబు ఫిక్స్ అయ్యారా - పక్కా వ్యూహం, వాట్ నెక్స్ట్..!?
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. టీడీపీ, జనసేన తమ అభ్యర్దుల తొలి జాబితా విడుదల చేసాయి. బీజేపీ తమతో కలిసి వస్తే అంటూ మూడు పార్టీల కలయిక పైన టీడీపీ, జనసేన నేతలు సందేహానికి కారణమయ్యారు. జనసేనకు 24 ఎమ్మెల్యే, 3 ఎంపీ స్థానాలు కేటాయించారు. బీజేపీ రాకపోతే సీట్లు మరింత పెరుగుతాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు తీరు భిన్నంగా ఉంది. బీజేపీ విషయంలో చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లేనా. ఏం జరుగుతోంది.
కొత్త లెక్కలు : ఏపీలో తిరిగి 2014 తరహాలో పొత్తులు రిపీట్ చేయాలని చంద్రబాబు, పవన్ భావించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా తాము కూటమిగా పోటీ చేస్తామని ప్రకటించారు. బీజేపీ, టీడీపీ పొత్తు కోసం తాను జాతీయ నేతలతో చీవాట్లు తిన్నానని పవన్ చెప్పుకొచ్చారు. ఢిల్లీలో చంద్రబాబు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చర్చించిన తరువాత టీడీపీ ఎన్డీఏ కూటమిలో చేరటం ఖాయమని భావించారు. ఇప్పటికి 15 రోజులు పూర్తయింది. కానీ, పొత్తు పైన ఇంకా స్పష్టత లేదు. అటు వైసీపీ అభ్యర్దులను ఖరారు చేస్తోంది. చంద్రబాబు, పవన్ పైన ఒత్తిడి పెరిగింది. ఫలితంగా కొన్ని సీట్లను మినహాయించి తమ సీట్ల ఖరారుకు నిర్ణయించారు. బీజేపీకి సమాచారం ఇచ్చామని చెబుతున్నారు. కానీ, బీజేపీ ఖచ్చితంగా తమతో కలిసి వస్తుందనే ధీమా మాత్రం చంద్రబాబు, పవన్ లో కనిపించటం లేదనేది స్పష్టమవుతోంది.

పొత్తుల వ్యూహాలు : మొత్తం 175 సీట్లలో టీడీపీ 94 స్థానాలకు అభ్యర్దులను ఖరారు చేసింది. జనసేనకు 24 సీట్లు ఖరారు చేసింది. మిగిలిన 57 స్థానాల పైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బీజేపీ కలిసి వస్తే వీటిలో వారితో కుదిరిన ఒప్పందం మేరకు సీట్లను కేటాయించాల్సి ఉంటుంది. అయితే, బీజేపీని ఫిక్స్ చేసే విధంగా చంద్రబాబు ముందస్తుగానే తమ అభ్యర్దులను ఖరారు చేసారు. మిగిలిన స్థానాల్లోనూ బీజేపీ పోటీకి సిద్దం కావాల్సి ఉంటుంది. పొత్తుల్లో బీజేపీ కోరిన విధంగా సీట్లు ఇచ్చేందుకు సిద్దంగా లేని చంద్రబాబు..వ్యూహాత్మకంగానే ఎంపీ సీట్లను పెండింగ్ లో ఉంచి..అసెంబ్లీ సీట్లను మాత్రం ప్రకటన చేసినట్లు స్పష్టమవుతోంది. ఇదే సమయంలో జనసేన సీట్లు మాత్రం 24 లో కేవలం అయిదు మాత్రమే ప్రకటించటం మరో వ్యూహంగా స్పష్టం అవుతోంది.
బీజేపీ ముందుకొచ్చేనా : ఇంకా ప్రకటించాల్సిన 57 స్థానాల్లో సీనియర్లు ఆశిస్తున్న నియోజకవర్గాలు అనేకం ఉన్నాయి. తొలి జాబితాలో పలువురు సీనియర్ల స్థానాలు ప్రకటించలేదు. అటు జనసేనకు గోదావరి, విశాఖ జిల్లాల్లో ఖరారు చేసారు. ఇప్పుడు బీజేపీ కలిసి వస్తే ఎంపీ స్థానాలు 6 వరకు ఇచ్చేందుకు టీడీపీ సిద్దంగా ఉందనే సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. బీజేపీ మాత్రం 8 ఎంపీ, 15 ఎమ్మెల్యే స్థానాలు కోరుతోంది. ఇందుకు అంగీకరిస్తే టీడీపీకి ఇక 42 స్థానాలే ఉంటాయి. దీని ద్వారా టీడీపీకి మొత్తంగా 136 స్థానాల్లోనే పోటీ చేయాల్సి ఉంటుంది. ఈ లెక్కలను పరిగణలోకి తీసుకున్న తరువాతనే సీట్లను పెద్ద సంఖ్యలో ప్రకటించినట్లు కనిపిస్తోంది. దీంతో, బీజేపీ తుది నిర్ణయం ఏ విధంగా ఉన్నా..తాము సంసిద్దంగా ఉండాలనే నిర్ణయానికి చంద్రబాబు, పవన్ వచ్చినట్లు స్పష్టమవుతోంది.












Click it and Unblock the Notifications