చంద్రబాబు Vs రేవంత్, కేసీఆర్ చేతికి అస్త్రం - బీజేపీ కొత్త ఫిట్టింగ్..!!
ఎన్నికల వేళ పొత్తులు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు దాదాపు ఖాయమైంది. ఈ పొత్తు ఏపీకే పరిమితం అవుతుందా. తెలంగాణలోనూ కొనసాగుతుందా. టార్గెట్ 400 సీట్లతో వ్యూహాలు అమలు చేస్తున్న బీజేపీ..తెలంగాణలోనూ పొత్తులు కొనసాగించాలనే భావిస్తున్నట్లు సమాచారం. బీజేపీకి సహకరిస్తున్న చంద్రబాబు కాంగ్రెస్ సీఎం రేవంత్ కు టార్గెట్ కావటం ఖాయం. కేసీఆర్ దీనికి అస్త్రంగా మలచుకుంటారా. ఏం జరిగే అవకాశం ఉంది.
బీజేపీ టార్గెట్: బీజేపీ నాయకత్వం ఈ సారి 400 ఎంపీ స్థానాల్లో గెలవటమే లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఎన్డీఏలో గతంలో కలిసి..ఆ తరువాత వీడిన పార్టీలను తిరిగి ఆహ్వానిస్తోంది. ప్రతీ ఎంపీ స్థానం కీలకంగా మారుతోంది. దక్షిణాదిన ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో సాధ్యమైనన్ని సీట్లు గెలవటమే టార్గెట్ గా వ్యూహాలు సిద్దం చేస్తోంది.

అందులో భాగంగా 2014 ఎన్నికల తరహాలో తెలుగు రాష్ట్రాల్లో పొత్తులకు బీజేపీ ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఏపీ వరకే పరిమితం అయినట్లు కనిపిస్తున్నా..తెలంగాణాలోనూ కొనసాగటం ఖాయమనే విశ్లేషణలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఈ పొత్తులతో బీజేపీ 1, టీడీపీ కీలకమైన మల్కాజ్ గిరి ఎంపీ స్థానాన్ని గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి 4 స్థానాలు గెలుపొందింది.
పొత్తుల లెక్కలు: కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తెలంగాణలో పోటీ చేయలేదు. బీజేపీ, జనసేన పొత్తుతో ముందుకు వెళ్లాయి. బీజేపీ 8 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ కు తెలంగాణలోని టీడీపీ శ్రేణులు సహకరించాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చినా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ ఆధిక్యత కొనసాగింది. ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ ను గ్రేటర్ పరిధిలో దెబ్బ కొట్టాలంటే సీమాంధ్ర ఓటర్లను తమ వైపు తిప్పుకోవటానికి తెలంగాణలోనూ టీడీపీ, జనసేనతో పొత్తు అవసరమని బీజేపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఖమ్మం జిల్లాలోనూ టీడీపీ ప్రభావం కొంత మేర ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ నేతలు తమకు ఎవరితోనూ పొత్తులు ఉండవని చెబుతున్నా..బీజేపీ జాతీయ నేతలు మాత్రం కలవటం ద్వారా 2019 మల్కాజ్ గిరి, ఖమ్మం, చేవెళ్ల వంటి స్థానాల్లో ప్రయోజనం ఉంటుందని విశ్లేషిస్తున్నారు.

కొత్త సమీకరణాలు: 2014 తరహా పొత్తులు ఏపీకే పరిమితం చేస్తే జాతీయ పార్టీగా బీజేపీ.. ఏపీలో ఈ రెండు పార్టీలు సమర్ధించుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. తెలంగాణలో పొత్తు ఖాయమైతే కాంగ్రెస్, బీఆర్ఎస్ పైన ఎలాంటి ప్రభావం ఉంటుందనే అంశంలో ఆరా తీస్తున్నట్లు సమాచారం. దీని ద్వారా సీఎం రేవంత్, కేసీఆర్ కు ఇక చంద్రబాబు సైతం రాజకీయ లక్ష్యంగా మారుటం ఖాయం. ఏపీలో గెలుపు కోసమే బీజేపీతో కలవాల్సి వస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
తెలంగాణలో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయని టీడీపీ..తెలంగాణలోనూ పోటీ చేయదని..ఏపీలో పొత్తు కారణంగా తెలంగాణలో సహజంగానే టీడీపీ శ్రేణుల మద్దతు బీజేపీకి ఉంటుందనేది ఆ పార్టీ నేతల తాజా వాదన. రెండు రాష్ట్రాల్లో పరస్పర ప్రయోజనాలతోనే పొత్తు ఒప్పందం ఫైనల్ అవుతుందని చెబుతున్నారు. దీంతో.. ఈ మూడు పార్టీల పొత్తు ఏపీకే పరిమితమా.. తెలంగాణ లోనూ కొనసాగుతుందా అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications