జగనా ? రఘురామా ? రెబెల్ ఎంపీకి అగ్నిపరీక్ష- కేంద్రం మొగ్గు ఎటు ? జూలై 4 న తేలిపోనుందా ?
ఏపీలో వైసీపీ తరఫున ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత సొంత పార్టీపై పోరు ప్రారంభించిన రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం త్వరలో ఏదో ఒకటి తేలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. రెండున్నరేళ్లుగా వైసీపీ సర్కార్ పై, వైఎస్ జగన్ పై అలుపెరగని పోరాటం చేస్తున్న రఘురామ ఈ క్రమంలో తన సొంత నియోజకవర్గం నరసాపురానికి పూర్తిగా దూరమయ్యారు. ఇప్పుడు ఆయనకు తన నియోజకవర్గం పరిధిలోకి వచ్చే భీమవరంలోకి అడుగుపెట్టే అవకాశం వచ్చింది. అయితే దానికీ జగన్, కేంద్రం ఒప్పుకోవాల్సిందే.

జగన్ తో రఘురామ పోరు
ఏపీలో వైసీపీతో విభేదించడం మొదలుపెట్టాక సీఎం జగన్ ను కూడా వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుని రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు తీవ్ర విమర్శలు చేశారు. ఓ దశలో జగన్ పై ఆయన చేసిన విమర్శల్ని రాజద్రోహంగా పరిగణించి ప్రభుత్వం సీఐడీతో కేసులు కూడా పెట్టించింది. అయితే అనూహ్యంగా రాజద్రోహం సెక్షన్లను సుప్రీంకోర్టు నిలిపేయడంతో రఘురామకు ఊరట లభించింది. అయినా రఘురామపై ఇతర కేసుల్లో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో రఘురామకు జగన్ సాయం అవసరం వచ్చింది.

జగన్ కరుణ కోసం ఎదురుచూపులు
ఇన్నాళ్లూ సీఎం జగన్ పై ఢిల్లీలో కూర్చుని బహిరంగంగా రోజూ విమర్శలు చేస్తున్న రఘురామరాజుకు ఇప్పుడు సీఎం జగన్ తో అవసరమొచ్చింది. వచ్చే నెల 4న ప్రధాని మోడీ భీమవరానికి వస్తున్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవంలో పాల్గొనేందుకు ఆయన భీమవరం వస్తున్నారు. ఈ నేపథ్యంలో రఘురామరాజు తన సొంత నియోజకవర్గానికి తిరిగి వచ్చేందుకు కూడా అవకాశం దొరికింది. అయితే ఇదంతా జరగాలంటే మళ్లీ జగన్ కరుణించాల్సిందే. దీంతో జగన్ కరుణం కోసం రఘురామ ఎదురుచూపులు చూస్తున్నారు.

కత్తులు నూరుతున్న జగన్
ఓవైపు నరసాపురంలో కేసులకు భయపడి ఢిల్లీలో మకాం వేసిన రఘురామరాజు ఏపీకి తిరిగొచ్చేందుకు ఇప్పటికే పలు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా విశాఖలో పార్లమెంట్ స్ధాయీ సంఘం ఏర్పాటు చేసిన ఓ సమావేశానికి వచ్చేందుకు ప్రయత్నించగా.. అరెస్టు తప్పదని డీజీపీ నుంచి హెచ్చరికలు వెళ్లాయి. దీంతో ఆయన ఆ టూర్ కు దూరమ్యయారు. ఇప్పుడు ప్రధాని మోడీ పర్యటన పేరుతో భీమవరానికి వచ్చేనెల 4న వచ్చేందుకు రఘురామ ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం అనుమతివ్వాలని కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే జగన్ సర్కార్ మాత్రం ఆయన ఏపీలో అడుగుపెడితే అరెస్టు చేసేందుకు సిద్ధంగా ఉంది.

జగన్ ను కాదని కేంద్రం కరుణిస్తుందా ?
రెబెల్ ఎంపీ రఘురామరాజు పేరు చెబితేనే జగన్ మండిపడుతున్నారు. బహిరంగంగా ఏమీ మాట్లాడకపోయినా అంతర్గతంగా మాత్రం జగన్ రఘురామపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రఘురామకు ప్రధాని టూర్ లో పాల్గొనేందుకు అనుమతివ్వాలని, భద్రత కల్పించాలని కేంద్రం కోరితే జగన్ ఎలా స్పందిస్తారన్నది చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రధాని టూర్ ప్రోటోకాల్ ప్రకారం సాగనుండటంతో దానికి స్ధానిక ఎంపీ హాజరుకాకుండా అడ్డుకోవడం అంత సులువు కాదు. కానీ ఒకవేళ కేంద్రమే జగన్ ను ఇబ్బందిపెట్టడం ఇష్టం లేక రఘురామకు అనుమతి ఇవ్వకపోతే మాత్రం రెబెల్ ఎంపీకి నిరాశ తప్పకపోవచ్చు.












Click it and Unblock the Notifications