జగన్, చంద్రబాబు, పవన్ కు షాకులు-సొంత నియోజకవర్గాల్లో ఎదురుదెబ్బలు ఇందుకే..
ఏపీలో తాజాగా ప్రకటించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాల్లో అధికార వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. టీడీపీ ఎన్నికల్ని బహిష్కరించిన నేపథ్యంలో వైసీపీ పయనం నల్లేరుమీద నడకే అయింది. అయితే పేరుకు టీడీపీ ఎన్నికల్ని బహిష్కరించినా.. ఆ పార్టీ అభ్యర్ధులు పలుచోట్ల రంగంలో నిలిచారు. అంతే కాదు అధికార పార్టీకి చుక్కలు చూపించారు. అదే సమయంలో టీడీపీ కంచుకోటల్లో వైసీపీ కూడా అదే హవా కొనసాగించింది. చివరికి పవన్ గతంలో పోటీ చేసిన భీమవరంలోనూ జనసేన రెండో స్ధానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇందుకు దారితీసిన కారణాల్ని ఓసారి చూద్దాం..
పరిషత్ ఫలితాల్లో సిత్రాలు
ఏపీలో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వచ్చేశాయి. ఇందులో అధికార వైసీపీ ప్రభంజనం సృష్టంగా కనిపించింది. ఆ తర్వాత స్ధానంలో టీడీపీ, జనసేన, బీజేపీ, ఇతర పార్టీలు నిలిచాయి. అయితే వైసీపీకి ఓటర్లు మరోసారి స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారు. రెండేళ్లుగా మారిన పరిస్ధితుల్లో సహజంగానే వైసీపీకి ఉన్న బలంతో పాటు అధికార పార్టీగా ఉన్న ప్రభావం కూడా ఇక్కడ బాగా పనిచేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా పార్టీల ఫలితాల కంటే ఈసారి ఆయా పార్టీల అధినేతల స్వస్ధలాల్లో చోటు చేసుకున్న సిత్రాలపై చర్చ జరుగుతోంది.
మంగళగిరిలో జగన్ కు ఎదురుదెబ్బలు
ఏపీ సీఎం వైఎస్ జగన్ నివాసముంటున్న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని అంతా భావించారు. రాష్ట్రమంతా వైసీపీ హవా వీస్తున్న వేళ వైసీపీ బలంగా ఉన్న మంగళగిరిలో అధికార పార్టీ విజయం నల్లేరుపై నడకే అని అనుకున్నారు. కానీ మంగళగిరి ఓటర్లు మాత్రం ఈసారి వైసీపీకి షాకిచ్చారు. 19 సీట్లలో వైసీపీకి కేవలం 7 సీట్లు మాత్రమే కట్టబెట్టారు. మిగిలిన సీట్లలో టీడీపీ, జనసేన హవా కొనసాగింది. దీంతో రాష్ట్రమంతా గెలిచిన సంతోషం వైఎస్ జగన్ కు లేకుండా పోతోంది.
కుప్పంలో చంద్రబాబుకు ఎదురుదెబ్బలు
విపక్ష నేత చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలోనూ నాలుగు ఎంపీటీసీ సీట్లను టీడీపీ కోల్పోయింది. అసలే కుప్పంలో ఓ పంచాయతీ కోల్పోయినా నానా రచ్చ చేస్తున్న వైసీపీ సోషల్ మీడియా.. ఈసారి కూడా కుప్పంలో టీడీపీ ఓటమిని హైలెట్ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. కుప్పం పరిధిలోకి వచ్చే కుప్పం, రామకుప్పం, శాంతిపురం, గుడిపల్లె మండలాల్లో ఎంపీటీసీ స్ధానాల్ని టీడీపీ వైసీపీకి కోల్పోవడం ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా మారింది. కుప్పంలో చంద్రబాబును ఎలాగైనా ఓడించేందుకు వైసీపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇచ్చి మెజారిటీ తగ్గించగలిగింది. కానీ చంద్రబాబు కంచుకోట అయిన కుప్పంలో వైసీపీ జెండా మాత్రం ఇంకా ఎగరాల్సి ఉంది.
భీమవరంలో పవన్ కు షాకులు
పశ్చిమగోదావరి జిల్లాలో కాపుల జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాల్లో భీమవరం కూడా ఒకటి. ఇక్కడ పరిస్ధితులు తనకు పూర్తిగా అనుకూలంగా ఉంటాయని భావించి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన పవన్... తన పార్టీ జనసేన కూడా అక్కడ స్ధానిక ఎన్నికల్లోనూ గెలిపించుకోలేకపోయారు. ఇక్కడి 18 ఎంపీటీసీ సీట్లలో వైసీపీ 14 గెలిచింది. జనసేన కేవలం 3 సీట్లు సాధించగా.. టీడీపీ ఒకటికి పరిమితమైంది. దీంతో జనసేన ప్రభావం ఇక్కడ ఏమాత్రం లేదని మరోసారి తేలిపోయింది. అసలే వచ్చే కేబినెట్ ప్రక్షాళనలో మంత్రి పదవి ఆశిస్తున్న స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.. ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో జనసేన అడ్రస్ లేకుండా పోయింది.
మంగళగిరిలో వైసీపీకి షాకుల వెనుక ?
మంగళగిరి నియోజక వర్గంలో వైసీపీకి తాజా షాకుల వెనుక స్ధానిక ఎమ్మెల్యే ఆర్కే వైఖరే కారణంగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో లోకేష్ పై గెలుపు తర్వాత ఆయన నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదనే ప్రచారం ఉంది. అదే సమయంలో రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటాన్ని తక్కువ చేసి వ్యాఖ్యలు చేయడంతో పాటు వారిని కలిసేందుకు కూడా ఇష్టపడని పరిస్దితులు ఉన్నాయి. దీంతో అమరావతి ప్రభావం మంగళగిరి నియోజకవర్గంపై పడింది. దీంతో ఇక్కడ వైసీపీ కేవలం 7 ఎంపీటీసీ సీట్లకే పరిమితమైంది. అదే సమయంలో రాజధాని ఉద్యమం ప్రభావం టీడీపీకి కలిసొచ్చినట్లు తెలుస్తోంది.
కుప్పంలో చంద్రబాబుకు దెబ్బల వెనుక ?
అలాగే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం పరిధిలోనూ ఎంపీటీసీ సీట్లను టీడీపీ కోల్పోవడం వెనుక ప్రలోభాలు భారీగా పనిచేయటడంతో పాటు స్ధానికంగా ఎమ్మెల్యే అందుబాటులో ఉఁడటం లేదన్న అసంతృప్తి, అధికారంలో ఉన్నప్పుడు కుప్పంపై దృష్టిపెట్టినంతగా.. విపక్షంలో ఉన్నప్పుడు పట్టించుకోవడం లేదన్న భావన అక్కడి గ్రామాల్లో కనిపిస్తోంది. అదే సమయంలో వైసీపీ చంద్రబాబు అడ్డాపై సీరియస్ గా దృష్టిపెట్టి స్ధానిక నేతల్ని పోత్సహిస్తుండంతో ప్రతీ ఎన్నిక్లలోనూ చంద్రబాబుకు ఎదురుదెబ్బలు తప్పడం లేదు.
భీమవరంలో పవన్ ఛరిష్మా పూర్తిగా మాయం
జనసేనాని పోటీ చేసి ఓడిన భీమవరంలో పరిస్దితులు ఇప్పుడు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఓవైపు, జనసేన నేతలపై అణచివేతలు, దాడులు, కేసులు మరోవైపు జనసేన పార్టీని కకావికలం చేసేశాయి. దీంతో జనసేన కార్యకర్తలు సైతం మనస్ఫూర్తిగా ఆ పార్టీకి పనిచేయలేని పరిస్ధితులు ఉన్నాయి. అలాగే తనను ఓడించిన భీమవరానికి జనసేనాన్ని పవన్ ఆ తర్వాత రాకపోవడం, కనీసం సమీక్షలు కూడా నిర్వహించకపోవడం వంటి కారణాలతో జనసేన రోజురోజుకూ బలహీనపడుతూ వస్తోంది. దీని ప్రభావం తాజా పరిషత్ ఎన్నికల ఫలితాలపై పడినట్లు తెలుస్తోంది.
Recommended Video
పరిషత్ తీర్పు నేర్పుతున్న పాఠాలివే..
పరిషత్ తీర్పులో చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ కు తమ సొంత నియోజకవర్గాలుగా భావిస్తున్న కుప్పం, మంగళగిరి, భీమవరాల్లో ఎదురుదెబ్బలు తగలడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వాలిపోతున్న విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ తో పాటు అభివృద్ధ, సంక్షేమ కార్యక్రమాల కోసం జిల్లాలు తిరుగుతున్న జగన్ కూడా తమ సొంత నియోజకవర్గాలపై మాత్రం అస్సలు దృష్టిపెట్టడం లేదు. అక్కడ తమ ఓట్లు ఎక్కడికీ పోవన్న ధీమానే వారి కొంపముంచుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాలు వీరికి నేర్పుతున్న పాఠాలు ఇవేనన్న చర్చ జరుగుతోంది.