రాజధానుల పోరులో మరో ట్విస్ట్ ? విభజనపై సుప్రీం విచారణే టర్నింగ్ ! అది మారితే లైన్ క్లియర్ ?
ఏపీలో మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో సాగుతున్న పోరును రాష్ట్ర విభజనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏపీలో అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన వైసీపీ సర్కార్.. దీనిపై వాదనలు వినిపించకముందే.. 2014లో జరిగిన రాష్ట్ర విభజనపై దాఖలైన పిటిషన్లపై విచారణలో అఫిడవిట్ వేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ అఫిడవిట్ లో విభజన సరిగ్గా జరగలేదని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. తద్వారా విభజన చట్టంలో మార్పులు కోరుతోంది. దీంతో మూడు రాజధానుల విచారణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం విభజన చట్టంలో మార్పులు కోరుతున్నట్లు కనిపిస్తోంది.

సుప్రీంలో విభజన చట్టంపై విచారణ
ఏపీని రెండు రాష్ట్రాలుగా విభజిస్తూ 2014లో కేంద్రం ఎన్నికలకు ముందు హడావిడిగా ఆమోదించిన విభజన చట్టాన్ని అప్పట్లోనే ఉండవల్లి అరుణ్ కుమార్, జయప్రకాష్ నారాయణ్, జేడీ లక్ష్మీనారాయణ, రఘురామకృష్ణంరాజు వంటి వారు వ్యతిరేకించారు. దీనిపై వీరితో పాటు 28 మంది దాఖలు చేసిన పిటిషన్లు సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉన్నా చాలా సంవత్సరాలుగా ముందడుగు పడలేదు. ఇప్పుడు విభజన చట్టం పదేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు దీనిపై విచారణ చేపట్టింది. సుప్రీం విచారణతో అప్పట్లో విడిపోయిన రాష్ట్రాలు తిరిగి కలిసిపోయే అవకాశం లేకున్నా అప్పట్లో జరిగిన తప్పిదాలు మాత్రం సరిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏపీ సర్కార్ అఫిడవిట్
సుప్రీంకోర్టులో విభజన చట్టంపై దాఖలైన పిటిషన్లపై విచారణ తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కూడా తమ వంతుగా అఫిడవిట్ దాఖలు చేసింది. ఇందులో విభజన వ్యవహారం సరిగా జరగలేదని, అప్పట్లో ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని అరోపించింది. రాష్ట్ర విభజన సహేతుకంగా లేకపోవడం, విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చకపోవడం వల్ల రాష్ట్రం నష్టపోతోందని పేర్కొంది. అలాగే పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా ఇతర హామీల్ని కూడా ప్రస్తావించింది. అదే సమయంలో రాజధాని వ్యవహరాన్ని కూడా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీ సర్కార్ అఫిడవిట్ శుభపరిణామమంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ వంటి వారు స్వాగతిస్తున్నారు.

మూడు రాజధానుల విచారణ వేళ
ఏపీలో అమరావతినే రాజధానిగా పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. అయితే విచారణ రెగ్యులర్ గా జరగడం లేదు. ఈ సమయంలో విభజన చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వం తన వాదన అఫిడవిట్ రూపంలో సుప్రీంకోర్టుకు తెలిపింది. అలాగే రాజధానులతో పాటు ఇతర అంశాల్లో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ప్రస్తావించింది. దీంతో విభజన అంశంలో పేర్కొన్న రాజధాని అంశం సరిచేయాలని ప్రభుత్వం ఇప్పుడు వాదించబోతున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే విభజన వ్యవహారం కాస్తా రాజధానులపై దాఖలైన పిటిషన్లకు లింక్ కావడం ఖాయం. ఈ రెండు అంశాల్ని ఇప్పటికే ఓసారి కలిపి విచారిస్తామని చెప్పిన సుప్రింకోర్టు.. ఆ తర్వాత మాత్రం విడివిడిగానే విచారించాలని నిర్ణయించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అఫిడవిట్ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం కీలకంగా మారింది.

చట్టంలో సవరణతో రాజధానులు ?
ఏపీ ప్రభుత్వం కోరుతున్నట్లుగా విభజన చట్టంలో రాజధాని స్ధానంలో రాజధానులు అని మారిస్తే ఎన్నో లెక్కలు మారిపోతాయి. అయితే ఓసారి రాజధానిగా పేర్కొన్న తర్వాత దాన్ని బహుళ రాజధానులుగా మార్చాలంటే తిరిగి కేంద్రం అనుమతి ఇవ్వాల్సిందే. అలాగే సుప్రీంకోర్టులో అమరావతి పిటిషన్ల విచారణపైనా ఈ ప్రభావం పడక తప్పదు. అందుకే సుప్రీంకోర్టు కూడా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. అయితే విభజన చట్టంలో రాజధాని అంశంలో మార్పు జరిగితే మాత్రం ఇక అమరావతి పిటిషన్లకు విలువ తగ్గిపోవడం కూడా ఖాయమన్న వాదన ఉంది. దీంతో ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీసుకోబోయే నిర్ణయం, కేంద్రం వాదన కీలకంగా మారబోతున్నాయి.












Click it and Unblock the Notifications