సీనియర్ మంత్రికి ఎసరు: జ్యోతులకు చెక్ చెప్పేందుకు పావులు?
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరిన జ్యోతుల నెహ్రూకు త్వరలో మంత్రి పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది. అదే సమయంలో ఆయన స్థానంలో ఓ సీనియర్ నేతకు షాక్ ఇవ్వనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కీలక నేత, కాపు కీలక నేత జ్యోతుల నెహ్రూ గత నెలలో సైకిల్ ఎక్కారు. దీంతో, టిడిపి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జిల్లా పార్టీ రాజకీయాలు మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రంగా జరిగేవి. ఇప్పుడు కొత్తగా జ్యోతుల నెహ్రూ వచ్చారు.
గతంలో యనమల వల్లే జ్యోతుల టిడిపి వీడారనే వాదనలూ ఉన్నాయి. ఇప్పుడు జ్యోతుల చేరికలో జిల్లాలో మరోసారి కొత్త సమీకరణాలు తెరపైకి వస్తున్నాయని అంటున్నారు. జ్యోతులకు మంత్రి పదవి హామీతోనే టిడిపిలోకి చేర్చుకున్నారని ఆయన వర్గీయులు బలంగా భావిస్తున్నారు.
జ్యోతులకు మంత్రి పదవితో పాటు ఆయన తనయుడు నవీన్కు కూడా ఓ పదవి రానుందని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. అయితే, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని విడి, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు వచ్చారని, జెండా మోసిన వారి మాటేమిటని కొందరు తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.
ఇదిలా ఉండగా జ్యోతుల నెహ్రూకు మంత్రి పదవి ఇస్తే మరో సీనియర్ మంత్రిని తొలగించవచ్చుననే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జ్యోతులకు పదవి ఇస్తే ఆ స్థానంలో ఎవరిని తొలగిస్తారనే చర్చ తెలుగుదేశం పార్టీలో జోరుగా సాగుతోంది.
జ్యోతుల నెహ్రూ టిడిపిలో చేరకు ముందు ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జ్యోతుల నెహ్రూ మంచి నేత అని, ఆయన టిడిపిలో ఉండి ఉంటే తనకు మంత్రి పదవి రాకపోయి ఉండేదని వ్యాఖ్యానించారు. ఇది కూడా చర్యనీయాంశంగా మారింది. ఎసరు పడేది చినరాజప్పకేనా అనే చర్చ సాగుతోంది.
అయితే, జ్యోతులకు పదవి రాకుండా అడ్డుకునేందుకు, జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పకుండా ఉండేందుకు మిగతా మంత్రులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారట. జ్యోతుల కుటుంబానికి ఓ పదవి.. అంటే జెడ్పీ చైర్మన్ పదవి ఆయన తనయుడికి ఇప్పించడం ద్వారా జ్యోతులకు చెక్ చెప్పాలని భావిస్తున్నారని అంటున్నారు.