Pawan Kalyan Varahi : ఏపీలో వారాహి రంగు మారుతుందా ? వైసీపీ మంత్రి అనుమానం !
పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కోసం సొంతంగా తయారు చేయించుకున్న వారాహి వాహనంపై ఎప్పుడూ లేనంత చర్చ జరుగుతోంది. ప్రత్యర్ధులకు కంటగింపుగా మారిన వారాహి వాహనం విషయంలో ఇప్పటికే పలు వివాదాలు ముసురుకున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కొక్కటిగా వాటిని పరిష్కరించుకుంటూ వస్తున్న పవన్ కళ్యాణ్.. తాజాగా ఈ వాహనం రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేయించుకున్నారు. అయితే తెలంగాణలో రిజిస్టర్ అయిన ఈ వాహనం ఏపీలో ఎంట్రీ కోసం రంగు మార్చుకుంటుందా అన్న చర్చ సాగుతోంది.
ఆలివ్ గ్రీన్ రంగులో రూపొందించిన పవన్ వారాహి వాహనంపై వైసీపీ మాజీ మంత్రి పేర్నినాని ముందుగా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఆర్మీ వర్గాలు వాడే ఆలివ్ గ్రీన్ రంగును పవన్ వాహనానికి ఎలా వాడతారన్న చర్చ సాగింది. అయితే తెలంగాణలో రవాణాశాఖ అధికారులు దీనికి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాఫీగా సాగిపోయింది. దీనిపై స్పందించిన వైసీపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్.. ఏపీలో నిబంధనల్ని పాటిస్తేనే ఎంట్రీ ఉంటుందని తేల్చిచెప్పేశారు.
ఇవాళ మరోసారి ఇదే అంశంపై స్పందించిన వైసీపీ మంత్రి గుడివాడ అమర్ నాథ్.. మరో వివాదానికి ఆజ్యం పోశారు. పవన్ వారాహి వాహనం ఏపీలో ఎంట్రీ ఇచ్చేందుకు ఏ రంగు మార్చుకుంటుందో అని ఆయన ప్రశ్నించారు. దీంతో ఏపీలో ఎంట్రీ కోసం వారాహి రంగు మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్న చర్చ మొదలైంది. ఏపీకి వచ్చాక వారాహి వాహనం నిబంధనలకు అనుగుణంగా ఉంటే రవాణాశాఖ అనుమతి ఇస్తుందని మంత్రి గుడివాడ తెలిపారు. ఇందుకోసం ఏపీలోకి వచ్చాక వారాహి ఏ రంగు వేసుకుంటుందో అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ఎవరెక్కువ ప్యాకేజీ ఇస్తే వారి రంగు వేసుకుంటుందేమో చూడాలన్నారు.