వైఎస్ జగన్ టీమ్లో రత్నప్రభ, రమాకాంత్ రెడ్డి? శ్రీలక్ష్మికి కీలక హోదా!
అమరావతి: ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కీలక హోదాల్లో పనిచేసి పదవీ విరమణ చేసిన కొందరు సీనియర్ల సేవలను వినియోగించుకోబోతున్నారు కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దీనికి సంబంధించి.. కొంతమంది అధికారుల పేర్లతో కూడిన జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లంను సలహాదారుగా నియమించవచ్చంటూ వార్తలు వస్తున్నాయి. ఆయనతో పాటు మరికొందరు ఐఎఎస్ అధికారులను కూడా పిలిపించుకోవాలని, వారికి పెద్దపీట వేయాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రమాకాంత్ రెడ్డి, కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, కొద్దినెలల కిందట పదవీ విరమణ చేసిన రత్నప్రభల పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు సమాచారం.
కేసులు ఎదుర్కొన్నా, జైలు పాలైనా..
వారితోపాటు- తెలంగాణ క్యాడర్కు చెందిన సీనియర్ ఐఎఎస్ అధికారిణి శ్రీలక్షిని కూడా రాష్ట్రానికి పిలిపించుకోవడం ఖాయమైంది. తనను రిలీవ్ చేయాలని, ఏపీకి బదలాయించాలని కోరుతూ శ్రీలక్ష్మి స్వయంగా తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. త్వరలోనే ఆమెను రిలీవ్ చేయవచ్చని అంటున్నారు. శ్రీలక్ష్మి రావటం అంటూ జరిగితే- వైఎస్ జగన్ ఆమెకు కీలక హోదాను అప్పగిస్తారని చెబుతున్నారు.
రత్నప్రభ గానీ, శ్రీలక్ష్మి గానీ.. వైఎస్ జగన్ ఆస్తుల కేసుల్లో విచారణను ఎదుర్కొన్న వారే. శ్రీలక్ష్మి కొన్ని రోజులు కారాగార జీవితాన్ని కూడా గడిపారు. క్లీన్చిట్తో బయటికి వచ్చారు. ప్రస్తుతం ఆమె తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్య కార్యదర్శి హోదాలో పనిచేస్తున్నారు. ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వంలో పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వైఎస్ జగన్తో కలిసి పనిచేయడానికి మక్కువ చూపుతున్నారు.
శ్రీలక్ష్మి
వైఎస్ జగన్పై నమోదైనవన్నీ తప్పుడు కేసులని, రాజకీయ కారణాలతో ఆయనను జైలుపాలు చేశారని శ్రీలక్ష్మి విశ్వసిస్తున్నారు. వైఎస్ జగన్ తప్పు చేయలేదని నమ్ముతున్నారు. అందుకే- ఆయన సారథ్యంలో ఏర్పాటు కాబోయే ప్రభుత్వంలో పనిచేయడానికి శ్రీలక్ష్మి ఉవ్విళ్లూరుతున్నారు.
రమాకాంత్ రెడ్డి, రత్నప్రభలకు ప్రాధాన్యత
రత్నప్రభ కూడా అంతే. నిజానికి ఆమె కర్ణాటక క్యాడర్కు చెందిన అధికారిణి. డెప్యుటేషన్పై వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో పనిచేశారు. కీలక శాఖలకు ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. రత్నప్రభ కూడా వైఎస్ జగన్ ఆస్తుల కేసులను ఎదుర్కొన్నారు. విచారణకు హాజరయ్యారు. న్యాయస్థానం సమక్షంలో నిల్చున్నారు. విచారణను ఎదుర్కొన్న ఆమె నిర్దోషురాలిగా బయటికి వచ్చారు. అనంతరం తన సొంత రాష్ట్రానికి వెళ్లారు. కర్ణాటక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఓ మహిళా అధికారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం కర్ణాటకలో అదే తొలిసారి.
రమాకాంత్ రెడ్డి పదవీ విరమణ చేసిన తరువాత రాష్ట్ర ఎన్నికల అధికారిగా నామినేట్ అయ్యారు. ఆయన నేతృత్వంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. 2014లో మున్సిపల్, పంచాయతీ ఎన్నికలను ఆయన సమర్థవంతంగా నిర్వహించారు.
రత్నప్రభకు మౌలిక సదుపాయాల కల్పన, పారిశ్రామిక రంగంపై మంచి పట్టు ఉంది. లాజిస్టిక్ సెక్టార్పైనా ఆమెకు మంచి అవగాహన ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రత్నప్రభ సేవలను రాష్ట్రానికి ఉపయోగించుకోవాలని వైఎస్ జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పదవీ విరమణ చేసిన రత్నప్రభ..ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన వెంటనే ట్వీట్ చేశారు. వైఎస్ జగన్కు శుభాకాంక్షలు తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలన అద్భుతమంటూ కొనియాడారు. మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకునే వైఎస్ వంటి ముఖ్యమంత్రి మరొకరు లేరంటూ కితాబిచ్చారు.