నరసింహన్ మార్పు: గవర్నర్గా షీలా దీక్షిత్ వస్తారా?
హైదరాబాద్: రాష్ట్రానికి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ గవర్నర్గా వచ్చే అవకాశాలు లేకపోలేదు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనతో పాటు రాష్ట్ర గవర్నర్ మార్పు పైనా ప్రచారం సాగుతోంది. రాజకీయ కోణంలోనే ఈ మార్పు దిశగా ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుత గవర్నర్ నరసింహన్ స్థానంలో కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ లేదా షీలా దీక్షిత్ల పేర్లు వినవస్తున్నాయంటున్నారు. వీరిద్దరిలో ఒకరిని నియమించవచ్చునని ప్రచారం సాగుతోంది. కర్ణాటక గవర్నర్గా ఉన్న భరద్వాజ తనను ఆంధ్రప్రదేశ్కు పంపించాల్సిందిగా కోరుతున్నారు.
మొన్నటిదాకా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్... షీలా దీక్షిత్పై ఎసిబికి నివేదిక ఇచ్చారు. కేసు నమోదు చేస్తే ఆమెపై విచారణ జరుగుతోంది.
కాగా, నిన్నటి వరకు ఉద్యమ సమయంలో ఆంధ్రప్రదేశ్కు మాజీ పోలీసు అధికారి అయిన నరసింహన్ అవసరం ఉండేదని, ఇప్పుడు విభజన నేపథ్యంలో రాజకీయ చాతుర్యం కలిగిన వారు గవర్నర్గా వస్తే బాగుంటుందని కాంగ్రెసు పార్టీ భావిస్తున్నందు వల్లే భరద్వాజ, షీలా దీక్షిత్ల పేర్లు వినిపిస్తున్నాయని అంటున్నారు.
ఉద్యమ సమయంలో అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునేందుక మాజీ అధికారి అయిన నరసింహన్ను రాష్ట్రానికి పంపించడమే కాకుండా.. పొడిగించారు. ఇప్పుడు విభజన తేలింది. దీంతో ఇప్పుడు రాజకీయ చాణక్యం కలిగిన వారు అవసరమైతే సీమాంధ్రలో, తెలంగాణలో పార్టీకి ఉపయోగపడుతుందని కాంగ్రెసు భావిస్తోందని చెబుతున్నారు.
అంతేకాకుండా షీలా దీక్షిత్కు ఎపి నాయకులతో సంబంధాలు ఉన్నాయని చెబుతున్నారు. అయితే, దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందట. నరసింహన్కు ఎపి గవర్నర్గా 2012లోనే మరో విడత పొడిగింపు లభించింది. ఆయన 2017దాకా ఈ పదవిలో కొనసాగవచ్చు.