visakhapatnam south constituency: టీడీపీ అడ్డాలో వైసీపీ ఈసారైనా బోణీ కొడుతుందా ?
ఏపీలో విశాఖపట్నం లోక్ సభ స్ధానం పరిధిలోకి వచ్చే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం టీడీపీకి గట్టి పట్టున్న సీట్లలో ఒకటి. అయితే గత ఎన్నికల్లో వైసీపీ హవాకు ఎదురునిలిచి టీడీపీ అభ్యర్ధికి పట్టం గట్టిన ఇక్కడి ఓటర్లు ఈసారి ఏం చేయబోతున్నారనే ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే గతంలో టీడీపీ తరఫున రెండోసారి గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. వైసీపీలోకి ఫిరాయించి ఈసారి ఆ పార్టీ అభ్యర్ధిగా నిలవబోతున్నారు. దీంతో టీడీపీ అడ్డాలో వైసీపీ ఏం చేయబోతోందనే సస్పెన్స్ నెలకొంది.
ఈ నేపథ్యంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం చరిత్రను ఓసారి చూద్దాం..
2009లో నియోజకవర్గాల పునర్విభజనలో ఏర్పాటైన విశాఖ దక్షిణ సీటు జనరల్ నియోజకవర్గం. ఇది పూర్తిగా అర్బన్ సీటు. అంతకుముందు ఈ నియోజకవర్గంలో అత్యధిక ప్రాంతం విశాఖ -2 లో భాగంగా ఉండేది. ప్రస్తుతం ఇక్కడ రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో కులాల వారీగా చూసుకుంటే మత్స్యకారులే ఎక్కువ. ఆ తర్వాత తూర్పు కాపులు, గవరలు ఎక్కువగా ఉంటారు . ఎక్కువ భాగం పేదవారు ఎక్కువగా ఉండే స్లమ్స్ ఉంటాయి.

నెల్లూరు వంటి ప్రాంతాల నుండి వ్యాపారాల కోసం వచ్చి స్థిరపడిన రెడ్లు రాజకీయంగా ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.
1967 నుండి 2004 వరకు విశాఖ-2గా ఉన్న ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావానికి ముందు మూడు ఎన్నికలు జరిగాయి. వీటిలో సీపీఐ(1967), ఇండిపెండెంట్(1972), జనతా పార్టీ (1978) అభ్యర్ధులు గెలిచారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత చూస్తే 2004 వరకూ ఆరుసార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో నాలుగుసార్లు (1983, 1985, 1994, 1999) టీడీపీయే గెలిచింది. రెండుసార్లు ( 1989, 2004)మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలిచింది.
ఆ తర్వాత 2009లో విశాఖ సౌత్ నియోజకవర్గం ఏర్పాటు తర్వాత తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి ద్రోణంరాజు శ్రీనివాసరావు గెలిచారు. ఈ ఎన్నికల్లో మూడో స్ధానంలో నిలిచిన టీడీపీ అభ్యర్ధి వాసుపల్లి గణేష్ కుమార్.. అనూహ్యంగా పుంజుకుని ఆ తర్వాత రెండు ఎన్నికల్లో (2014, 2019)లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇలా 2019లో రెండోసారి గెలిచిన తర్వాత వైసీపీలోకి ఫిరాయించారు. ఈసారి వైసీపీ అభ్యర్ధిగా ఆయన పోటీ చేయబోతున్నారు. అయితే టీడీపీ-జనసేన పొత్తు ప్రభావంతో వైసీపీ ఈసారి కూడా బోణీ కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications