TDP Janasena Alliance: పవన్ కోరుకుంటున్న "గౌరవం" టీడీపీ నుంచి సాధ్యమేనా..!?
TDP Janasena Alliance: జనసేనాని తన మనసులో మాట బయట పెట్టారు. టీడీపీతో పొత్తు సంకేతాలు క్లియర్ గా ఇచ్చారు. కానీ కండీషన్స్ అప్లై అంటున్నారు. తగిన గౌరవం దక్కాలి..భంగం వాటిల్లకూడదని తన దైన శైలిలో అల్టిమేటం ఇచ్చారు. ఏ మాత్రం తేడా ఉన్నా పొత్తు ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు. తాను ఒంటరిగా వెళ్లినా గెలిపిస్తారనే నమ్మకం లేదంటూ చెప్పుకొచ్చారు. వీరమరణాలు అవసరం లేదని వ్యాఖ్యానించారు. పొత్తులు తప్పవని తేల్చి చెబుతూనే..తాను పొత్తుల కోసం వెంపర్లాడటం లేదని సంకేతాలు ఇచ్చే ప్రయత్నం చేసారు. అసలు..పవన్ చెబుతున్న గౌరవం వెనుక అసలు ఉద్దేశం ఏంటి. ఏం కోరుకుంటున్నారు...

పవన్ కోరుకుంటున్న గౌరవం వెనుక
టీడీపీతో పొత్తు పైన పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేసారు. పొత్తు తప్పదని తేల్చి చెప్పారు అందుకు అనేక అంశాలను తెర మీదకు తెచ్చారు. చంద్రబాబుతో భేటీ సమయంలో సీట్ల అంశం కూడా చర్చకు వచ్చిందని ప్రచారం సాగింది. కానీ, తాజా సభలో మాత్రం తాను సీట్లు గురించి చర్చించలేదని పవన్ చెప్పుకొచ్చారు. శత్రువు బలవంతుడని అంగీకరించారు. దీని కోసం శత్రువు కు శత్రువుగా ఉన్న వారితో కలవక తప్పదని వివరించారు. పవన్ - చంద్రబాబు భేటీలోనే పొత్తు ఖరారు అయినట్లు పవన్ వ్యాఖ్యలతో స్పష్టం అవుతోంది. అదే సమయంలో సీట్లు - అధికారంలోకి వస్తే పవర్ షేరింగ్ గురించే ఇప్పుడు తేలాల్సి ఉందని చెబుతున్నారు. ఈ వ్యవహారాల్లో తన పట్టు పెంచుకోవటం కోసమే సభా వేదికగా పవన్ కీలక వ్యాఖ్యలు చేసారని తెలుస్తోంది. అదే సమయంలో సీట్ల గురించి చర్చ జరగలేదని పార్టీ నేతలకు సభా ముఖంగా పవన్ క్లారిటీ ఇచ్చారు. దీంతో, పొత్తు ఖాయం.. తేలాల్సింది సీట్లు - పవర్ షేరింగ్ అనేది స్పష్టం అవుతోంది.

సీట్లు - అధికారంలో పదవులు ఎలా..
జనసేన గతం కంటే ఇప్పుడు క్షేత్ర స్థాయిలో యాక్టివ్ అయింది. పవన్ కల్యాణ్ కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతారని పార్టీ నేతలు అంచనాతో ఉన్నారు. ఎవరితో కలిసినా.. పవన్ సీఎం కావాలనేది అభిమానుల కోరిక. ఇప్పటికే మెగా అభిమానులతో పాటుగా ప్రజారాజ్యం మాజీ నేతలు కూడా మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పుడు టీడీపీతో పొత్తు ఖాయం కావటంతో వీరిలో ఎంత మంది మద్దతు కొనసాగుతుందనేది ఆసక్తి కర అంశం గా మారుతోంది. ఇప్పుడు టీడీపీ - జనసేన పొత్తులో భాగంగా ఎవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారనే లెక్కల పైన అనేక అంచనాలు ఉన్నాయి. కానీ, జనసేనకు 25 సీట్లు మించి ఇచ్చే అవకాశం లేదని టీడీపీ ముఖ్య నేతలు చెబుతున్నారు. మూడు లోక్ సభ సీట్లకు సిద్దంగా ఉన్నారని సమాచారం. అధికారంలోకి వచ్చిన తరువాత పదవుల విషయంలో మాత్రం జనసేనకు ప్రాధాన్యత పై అభ్యంతరం లేదని.. సీట్ల విషయంలో మాత్రం జనసేన కోరిన విధంగా టీడీపీ అంగీకరిస్తుందా లేదా అనేది ఇప్పుడు చర్చకు కారణమవుతోంది.

బీజేపీతో క్లారిటీ వచ్చాకే నిర్ణయం..
బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని టీడీపీ - జనసేన అంచనాతో ఉన్నాయి. దీని పైన బీజేపీ ముఖ్య నేతలను ఒప్పించే విధంగా కలిసి ప్రయత్నాలు చేయాలని నిర్ణయించారు. బీజేపీ పొత్తుకు ముందుకు వస్తే మూడు పార్టీల మధ్య సీట్ల పైన అధికారికంగా నిర్ణయం తీసుకోవాలని..అధికారమే లక్ష్యంగా సీట్ల పంపకాలు ఉండాలని ప్రాధమికంగా నిర్ణయించారు. బీజేపీ ముందుకు రాకపోతే, ఈ రెండు పార్టీలే సీట్ల సర్దుబాటు విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. అయితే, జనసేన ఈ సారి మాత్రం భారీగా సీట్లను ఆశిస్తుంది. పవన్ పొత్తులో భాగంగా దక్కించుకొనే సీట్ల సంఖ్య కీలకం కానుంది. సీట్ల సంఖ్యలో రాజీ పడితే పవన్ పైన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో జనసేనకు భారీగా సీట్లు ఇచ్చినా టీడీపీదీ అదే పరిస్థితి. దీంతో.. పవన్ కోరుకుంటున్న "గౌరవం" టీడీపీ నుంచి దక్కుతుందా..ఏం జరుగుతుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications