నారా లోకేష్ కోసం అమరావతిలో జగన్ బిగ్ ప్లాన్ ?
ఏపీలో ఎన్నికలకు ఏడాది సమయం కూడా లేదు. వచ్చే ఏడాది ఈ సమయానికి ఎన్నికలు పూర్తయి ఫలితాలు కూడా వచ్చేస్తాయి. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు, తమవైపు తిప్పుకునేందుకు ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవడం లేదు. ఇదే క్రమంలో అమరావతిలో మరోసారి గెలుపు కోసం సీఎం జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ వ్యూహం ప్రకారం నారా లోకేష్ ను మంగళగిరిలో అడ్డుకోవాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
అమరావతిలో పేదలకు ఇళ్ల స్ధలాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే హైకోర్టులో పోరాటం చేసి విజయం సాధించింది. దీనిపై సుప్రీంకోర్టులోనూ పోరాడి ఎలాగైనా పేదలకు ఇక్కడ ఇళ్లస్ధలాలు ఇవ్వాలని భావిస్తోంది. ఇదంతా మంగళగిరిలో లోకేష్ ను మరోసారి ఓడించేందుకేనని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇవాళ ఆరోపించారు. ఈ అంశంపై ఇవాళ రఘురామ కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్ర హైకోర్టులో అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలను వినిపించిన రాష్ట్ర ప్రభుత్వం, కోర్టును మభ్యపెట్టిందని రఘురామ ఆరోపించారు. రైతులకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం కోర్టు తప్పు కాదని, అది రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పని ఆయన తెలిపారు. గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు మేరకే రాజధాని అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నామని న్యాయ శాస్త్రంలో అక్షర జ్ఞానం లేని అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి తన వాదనలను వినిపించారన్నారు.
రానున్న ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి నారా లోకేష్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని అధికార పార్టీ పెద్దలకు తెలిసిందని రఘురామ చెప్పుకొచ్చారు. అందుకే మంగళగిరి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నామనే సాకుతో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తీసుకువచ్చి ఓటర్లుగా చేర్పించాలని నిర్ణయించుకున్నారన్నారు. అద్భుతమైన రాజధాని నగరాన్ని నిర్మించాలని గత ప్రభుత్వం భావిస్తే, అక్కడ పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ముఖ్యమంత్రి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.

పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వడాన్ని ఎవ్వరూ వ్యతిరేకించరు. అందరూ సపోర్ట్ చేస్తారు. తన ప్యాలెస్ బయట పేదల గృహాలను కూల్చివేసిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు రాష్ట్ర రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పడమే ఆశ్చర్యంగా ఉందన్నారు. నవ నగరాల నిర్మాణ కోసం కేటాయించిన స్థలం కాకుండా ఇతర ప్రాంతంలోని స్థలములో లేఅవుట్ వేసి అభివృద్ధి చేసి పేదలకు ఇళ్ల స్థలాలను ఇస్తే ఎవరికి ఎటువంటి అభ్యంతరం ఉండదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్న ప్లాట్లు మీవి కాదు కదా అని అమరావతి రైతులతో అన్న న్యాయదేవత, రాజధాని నగర నిర్మాణం కోసం తమ వ్యవసాయ భూములను ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ఇళ్ల స్థలాలను ఇచ్చారా? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదన్నారు.












Click it and Unblock the Notifications