పోలీసుల బూట్లు తుడిచి .. వచ్చి వెళ్ళే వాహనాలు శుభ్రం చేసి .. రాజధాని రైతుల వినూత్న నిరసన
Recommended Video
రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా రైతులు ఆందోళనలను ఉధృతం చేస్తున్నారు. ఈ రోజు నుండి సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిన రైతులు ఆందోళన ఉధృతం చేశారు .రాజధాని గ్రామాల్లో వినూత్న నిరసనకు దిగారు. ఇక వీరికి ప్రజల నుండి కూడా మద్దతు కూడా లభిస్తుంది. తమ భూములు రాజధాని కోసం తీసుకుని ఇప్పుడు ఇన్నేళ్ళ తర్వాత తమను ఏపీ ప్రభుత్వం మోసం చేస్తుందని ఆవేదన చెందుతున్న రాజధాని రైతులు తమ ఆవేదనను కొత్తగా తెలియజేస్తూ తమ దయనీయ స్థితి అర్ధం చేసుకోవాలని కోరుతున్నారు.

రాజధాని కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతులు
సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానుల ప్రకటన చేసిన నాటి నుండి నేటి వరకు రాజధాని 29 గ్రామాల రైతులు ఏదో ఒక విధంగా తమ నిరసనలు తెలియజేస్తూనే ఉన్నారు . రోజుకో రకంగా నిరసనలకు దిగిన రైతులు జలదీక్షలు, అర్ధనగ్న ప్రదర్శనలు చేశారు. ఇక మహిళలు రోజూ రాజధాని అమరావతి తరలించకుండా ఉండాలని పూజలు నిర్వహిస్తున్నారు. అయినా పట్టింపు లేని ప్రభుత్వ తీరును నిరసిస్తూ జాతీయ స్థాయి ఆందోళనకు శ్రీకారం చుట్టారు.

జాతీయ స్థాయి ఆందోళనలకు శ్రీకారం .. నేటి నుండి సకల జనుల సమ్మె
రాష్ట్రపతికి లేఖలు రాసి కారుణ్య మరణం ప్రసాదించాలని , తమకు చనిపోవటానికి అనుమతి ఇవ్వాలని కోరుతున్నారు రాజధాని ప్రాంత రైతులు . ఇక తాజాగా రాజధానిలోని మహిళలు కూడా కారుణ్య మరణం కావాలని రాష్ట్రపతికి లేఖలు రాసి ఆ లేఖలతోనే ఆందోళన నిర్వహించారు. ఇక నేడు సకల జనుల సమ్మెకు పిలుపునిచ్చిన రాజధాని రైతులు వినూత్న నిరసనలకు దిగారు.

రాజధాని గ్రామాలలో బంద్ .. రైతుల పోరాటానికి విభిన్న వర్గాల మద్దతు
17వ రోజు రాజధాని ఆందోళనల్లో భాగంగా 29 గ్రామాల్లో రైతులు తమ నిరసనల్ని తెలియజేస్తున్నారు.రాజధాని గ్రామాల్లో అత్యవసరాలు తప్ప మిగతావన్నీ బంద్ పాటిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలు మాత్రమే కాదు వ్యాపార సంస్థలు కూడా నేడు బంద్ పాటిస్తున్నాయి . రాజధాని రైతులకు మద్దతుగా నిలుస్తున్నాయి. రాజధాని గ్రామాలైన మందడం , వెలగపూడి,నవులూరు, తుళ్లూరు, ఉద్దందరాయునిపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, నీరుకొండ తో పాటూ అన్ని గ్రామాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.

పోలీసుల బూట్లు, వాహనాలు తుడిచిన రైతులు
ఇప్పటికే టీడీపీ, జనసేన , బీజేపీ సైతం రాజధాని రైతులకు అండగా పోరాటం చేస్తున్నాయి. ఇక ఈ రోజు అమరావతి రైతులు వినూత్నంగా తమ నిరసనల్ని తెలియజేశారు. శుక్రవారం ఆందోళనల్లో భాగంగారాజధాని ప్రాంత రైతులు పోలీసుల బూట్లు తుడిచారు. వారికి తమకు సహకరించాలని గులాబీలు ఇచ్చారు. పోలీసులు వద్దని వారిస్తున్నా వినకుండా బూట్లు శుభ్రం చెయ్యటమే కాదు తమ గ్రామాల వైపు వచ్చిన వాహనాలను కూడా తుడుస్తూ తమ నిరసన తెలియజేశారు . ఆర్టీసీ బస్సులు, కార్లు, బైక్లు ఇలా వచ్చిన ప్రతి వాహనాన్ని తుడిచి వారికి పూలు ఇస్తూ తమ ఉద్యమానికి సహకరించాలని కోరుతున్నారు. రాజధాని అమరావతి కోసం తమ ప్రాణాలైనా త్యాగం చేస్తామని చెప్తున్నారు.












Click it and Unblock the Notifications