ప్రజల్లోనే తేల్చుకుందాం.. పొలిటికల్ వార్కు జగన్ సై, మంత్రులకు అసలు పరీక్ష
స్థానిక సంస్థల ఎన్నికలు ఈ నెలాఖరులోగా పూర్తి చేయకపోతే... కేంద్రం నుంచి రావలసిన స్థానిక సంస్థల నిధులు రూ. 3వేల కోట్లకు పైగా నిలిచిపోనున్నాయి. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 59.85శాతం రిజర్వేషన్లతో జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఆర్థికంగా సతమతమవుతున్న రాష్ట్రం కేంద్రం నిధులు వదులుకోవడానికి సిద్ధంగా లేదు. దీంతో ముఖ్యమంత్రి జగన్ సీనియర్ మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి, ఇతరులతో సుదీర్ఘంగా చర్చించారు. 4వ తేదీ జరిగే కేబినెట్లో రిజర్వేషన్లను 50శాతానికి కుదిస్తూ ఆర్డినెన్స్ తీసుకురానున్నారు. ఆ వెంటనే స్థానికి సంస్థల షెడ్యూల్ విడుదల కానుంది.
Recommended Video
తగ్గనున్న బీసీ రిజర్వేషన్లు..?
స్థానిక సంస్థల ఎన్నికలకు 50శాతానికే రిజర్వేషన్లు కుదించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఏపీ సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే సీనియర్ మంత్రులతో సీఎం జగన్ చర్చించారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చించారు. ఇక్కడే టీడీపీ జగన్ సర్కార్ను ఇరికించే ప్రయత్నం చేస్తోంది. బీసీ రిజర్వేషన్లను ఎలా తగ్గిస్తారంటూ ప్రశ్నిస్తోంది. గతంలో ఇచ్చిన జీవో మేరకు బీసీలకు 34 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించింది. అయితే తాజాగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు 9.85శాతం కోత విధించనున్నట్లు సమాచారం. అంటే బీసీలకు 24.15శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఇదే విషయంపై మరో రెండ్రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత వారం రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
మున్సిపల్ ఎన్నికలు కూడా ఒకేసారి నిర్వహించాలన్న యోచన
ఇక ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికలతో పాటుగా మున్సిపల్ ఎన్నికలను కూడా ఒకేసారి పూర్తి చేయాలనే ఆలోచన చేస్తోంది ప్రభుత్వం. మళ్లీ మళ్లీ ఎన్నికలకు వెళ్లకుండా అన్నిటినీ ఒకేసారి పూర్తి చేయగలమా అనే దానిపై 4వ తేదీ జరగనున్న ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చిస్తారని సమాచారం. మార్చి 31లోగా ఎట్టి పరిస్థితుల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోతాయి.
గ్రామ సచివాలయాలే పోలింగ్ కేంద్రాలుగా..
ఈరెండు సమస్యలు ఇలా ఉంటే మరో సమస్య ఈ నెలలో ఇంటర్, 10వ తరగతి పరీక్షలు ఉండటం. స్థానిక సంస్థల ఎన్నికలకు టీచర్లు కీలకంగా వ్యవహరిస్తారు కాబట్టి వారంతా ఈ నెలలో జరగనున్న ఇంటర్మీడియెట్ పరీక్షలు ఆ తర్వాత 10వ తరగతి పరీక్షలతో బిజీగా ఉండనున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రెవిన్యూ సిబ్బందిని జంబ్లింగ్ పద్ధతిలో వినియోగించేలా జగన్ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా ఎన్నికల నిర్వహణ సమయంలో పోలింగ్ కేంద్రాలుగా స్కూళ్లు ఉంటాయి. అయితే పరీక్షలు ఉన్న నేపథ్యంలో వాటిని డిస్ట్రబ్ చేయకుండా ప్రస్తుతం ఉన్న గ్రామసచివాలయాలనే పోలింగ్ కేంద్రాలుగా పెట్టాలని జగన్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
మంత్రులకు పరీక్ష
ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు విపక్షాలు సిద్ధంగా లేవని సమాచారం. అదే సమయంలో కేంద్రం నుంచి నిధులు రావాలంటే ఎన్నికలు తప్పని సరి కాబట్టి వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు ఈ ఎన్నికలు మంత్రులకు కూడా పరీక్షగా నిలవనున్నాయి. ఎక్కడైనా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లు తగ్గాయంటే మంత్రి పదవులకు ఎసరు వచ్చే అవకాశాముంటుందని ఇదే విషయం కేబినెట్లో మంత్రులకు సీఎం జగన్ స్పష్టం చేయనున్నట్లు సమాచారం. మొత్తానికి రేపు జరగబోయే కేబినెట్ సమావేశంలో రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకురానుంది జగన్ ప్రభుత్వం.