పవన్ కళ్యాణ్ సమావేశం: పాస్లుంటేనే అనుమతి
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేపు శుక్రవారం సాయంత్రం పాల్గొనే మీడియా సమావేశానికి పాసులంటేనే అనుమతిస్తారు. ఈ విషయాన్ని మాదాపూర్ డిసిపి కాంతిరాణా టాటా చెప్పారు. సమావేశానికి 4 వేల మందికి మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. తన జనసేన పార్టీ పేరును, పార్టీ విధివిధానాలను ప్రకటించడానికి పవన్ కళ్యాణ్ రేపు శుక్రవారం సాయంత్రం నోవాటెల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
పవన్ కళ్యాణ్ సమావేశానికి వచ్చేవారికి బార్ కోడ్తో ఉన్న యాక్సెస్ పాస్లు ఇస్తామని నిర్వాహకులు చెప్పినట్లు డిసిపి తెలిపారు. సమావేశానికి పాస్లు తప్పని సరి అని చెప్పారు. సమావేశానికి పెట్టిన ఖర్చు వివరాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు సమర్పిస్తామని చెప్పారు. రోడ్లపై, హాల్ వెలువల ఏర్పాటు చేసే కటౌట్ల ఖర్చు వివరాలను కూడా రిటర్నింగ్ అధికారులకు ఇస్తామని అన్నారు.
తాము 3 వేల నుంచి 4 వేల మందికి మాత్రమే పాస్లు ఇస్తామని నిర్వాహకులు చెప్పినట్లు డిసిపి చెప్పారు. ఎక్కువ మంది వస్తే అనుమతి ఇవ్వబోమని స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ సమావేశానికి 200 మందితో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. అయితే, ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద యెత్తున హైదరాబాదు చేరుకున్నారు.
పవన్ కళ్యాణ్ పార్టీ జన సేన ఇప్పటికే సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో హల్చల్ చేస్తోంది. పార్టీ గేయం కూడా బయటకు వచ్చింది. అయితే, పవన్ కళ్యాణ్ ఏం చెబుతారు, ఏం మాట్లాడుతార అనేది ఆసక్తికరంగా మారింది. చిరంజీవి మెగా కుటుంబంలో మిగతావారి మద్దతు కూడా పవన్ కళ్యాణ్కు ఉన్నట్లు లేదు.