టీడీపీపై రూటు మార్చేసిన బీజేపీ ? ఢిల్లీలో పొత్తులపై చర్చ వేళ...
ఏపీలో 2019 ఎన్నికల నేపథ్యంలో బీజేపీ-టీడీపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. అంతకు ముందు వరకూ టీడీపీతో పొత్తు పెట్టుకుని పలు హామీలు ఇచ్చిన బీజేపీ.. వాటిని నిలబెట్టుకోవడంలో విఫలం కావడంతో వీరిద్దరి మధ్య పొత్తు చెడింది. అంతటితో ఆగకుండా ఇరుపార్టీలు మాటల యుద్ధానికి దిగాయి. చివరికి బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ధర్మపోరాటం పేరుతో చంద్రబాబు నానా హంగామా చేసినా ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. దీంతో ఆయన రూటు మార్చారు.
తిరిగి బీజేపీతో పొత్తు కోసం అర్రులు చాచడం మొదలుపెట్టారు. అయితే బీజేపీ మాత్రం చంద్రబాబు తమపై చేసిన యుద్ధాన్ని మర్చిపోలేదు. అందుకే వైసీపీ, టీడీపీ ఇద్దరూ తమకు సమానమే అంటూ నిన్న మొన్నటివరకూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. అయితే తాను కోరి పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఈ విషయంలో బీజేపీకి షాకిచ్చారు. వైసీపీకి వ్యతిరేకంగా రాష్ట్రంలో ఉమ్మడిగా విపక్షాలు పోరాడితే తప్ప గెలవలేమని తేల్చిచెప్పేశారు. కాబట్టి టీడీపీతో పొత్తు తప్పనిసరి అని బీజేపీకి చెప్పేశారు.

ఇక్కడే బీజేపీ ఇరుకునపడింది. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. టీడీపీని కలుపుకోకపోతే పవన్ కళ్యాణ్ కు కోపం. కలుపుకుంటే తాము యూటర్న్ తీసుకున్నట్లవుతుంది. అలాగే పొత్తు లేకపోతే పవన్ కూడా తమను వదిలి టీడీపీతో వెళ్లిపోవడం ఖాయం. అదే జరిగితే మరింత అవమానం. దీంతో ఢిల్లీ పెద్దలకు నివేదించి టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తుకు ప్రతిపాదనలు పంపింది. దీనిపై ప్రస్తుతం ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని బీజేపీ నేతలే స్వయంగా వెల్లడించారు.
ఈ నేపథ్యంలో టీడీపీ విషయంలో రాష్ట్ర బీజేపీ నేతలు కూడా రూటుమార్చారు. గతంలో టీడీపీపై విమర్శలతో విరుచుకుపడిన నేతలు కొంతకాలంగా శాంతించారు. టీడీపీ-వైసీపీ ఒక్కటే అని ఆరోపించిన బీజేపీ నేతలు కాస్తా ఇప్పుడు టీడీపీతో పొత్తుకు చర్చలు జరుగుతున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. దీంతో పాటే టీడీపీపై విమర్శల దాడి పూర్తిగా తగ్గించేశారు. అందుకు తగ్గట్లే చంద్రబాబు కూడా బీజేపీ నేతలపై పోలీసుల తాజా దాడిని తప్పుబట్టి సంఘీభావం తెలిపారు. ఇదంతా చూస్తుంటే తిరిగి టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు పొడవటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications