TDP: వైసీపీ నేతలు దాడులు చేస్తుంటే ముఖ్యమంత్రి మౌనం దేనికి సంకేతం?
ఆత్మకూరు ఉప ఎన్నికల విషయంలో అధికార పార్టీ వ్యవహరించిన తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. చట్ట సభ సభ్యుడు చనిపోతే....వాళ్ల కుటుంబ సభ్యులకే తిరిగి ఉప ఎన్నికల్లో సీటు ఇస్తే పోటీ పెట్టకూడదు అనే విధానం తెలుగుదేశం పాటిస్తోందన్నారు. ఈ విధానంతోనే గౌతమ్ రెడ్డి మృతి కారణంగా వచ్చిన ఉప ఎన్నికలో టీడీపీ పోటీ పెట్ట లేదన్నారు. అయితే దీని పైనా వైసిపి నీచంగా రాజకీయ విమర్శలు, సవాళ్లు చెయ్యడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. సంస్కారం లేకుండా వైసిపి నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బద్వేల్ లో ఎందుకు పోటీ పెట్టలేదో...ఆత్మకూరులో కూడా అందుకే పోటీ పెట్టలేదన్నారు. రాజకీయాల్లో కొన్ని ఆచారాలు, సాంప్రదాయాలు పాటించాలని సూచించారు. జగన్ పరిపాలన చెయ్యలేకపోతున్నారని.....ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోందన్నారు.

పోస్టుల పేరుతో కేసులు పెడుతున్న ప్రభుత్వం
టీడీపీ మండల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇన్ ఛార్జిలతో చంద్రబాబు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. 2020లోనే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పిన జగన్ ప్రభుత్వం...2022 వచ్చినా ప్రాజెక్టు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. మహానాడు విజయవంతమవడంతో ప్రభుత్వం సోషల్ మీడియాలో పోస్టుల పేరుతో వేధింపులు మొదలుపెట్టిందని ఆరోపించారు. మహానాడు సక్సెస్ పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో ప్రభుత్వం కుట్ర పూరితంగా టీడీపీ నాయకులను కేసులతో భయపెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు.

రివర్స్ టెండరింగ్.. రివర్స్ ప్రాజెక్టులు
రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాలతో పోలవరం ప్రాజెక్టును బలిచేసిందని, రివర్స్ టెండరింగ్ అంటూ గొప్పగా చెప్పి పోలవరం ప్రాజెక్టును రివర్స్ చేశారంటూ మండిపడ్డారు. పనులు చేస్తున్న ఏజెన్సీని మార్చవద్దని కేంద్రం స్పష్టంగా చెప్పినప్పటికీ, ఆ మాటను పెడచెవిన పెట్టడంతోనే అనర్థం జరిగిందన్నారు. పోలవరంలో కీలకమైన డయాఫ్రం వాల్ దెబ్బతినడానికి నూరు శాతం ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.

ఒక్క నెలలో రూ.9500 కోట్ల అప్పు
ఒక్క నెలలో రూ.9500 కోట్లు అప్పులుగా తెచ్చారంటే...రాష్ట్రం పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవాలని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు, ప్రజా ప్రతినిధులు ప్రజలు, ఉద్యోగులపై దాడులు చెయ్యడం పరిపాటిగా మారిందన్నారు. వైసిపి ఎమ్మెల్యే జక్కంపూడి రాజా... ఏఈ సూర్యకిరణ్ పై దాడి చేయడాన్ని ఖండిచారు. అధికార పార్టీనేతల ఆకృత్యాలకు అంతం లేకుండా పోతోందని, స్వయంగా ప్రజా ప్రతినిధులు, వైసిపి మూకలు అధికారులపై దాడులు చేస్తుంటే ముఖ్యమంత్రి మౌనం దేనికని చంద్రబాబు ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications