టీడీపీలో కొత్త జోష్.. వైసీపీ సెల్ఫ్ గోల్ఫ్: సుప్రీం కోర్టు తీర్పుతో కొత్త సీన్: అధికార పార్టీ హవాకు
అమరావతిఫ స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా వ్యవహారం ఏపీలో ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల సంఘం అన్నట్లుగా మారింది. ఎన్నికల కమిషనర్ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి మొదలు మంత్రుల వరకూ వరుసగా తప్పు బడుతూ రమేష్ కుమార్ పైన విరుచకుపడ్డారు. చంద్రబాబు ఒత్తిడితోనే నిర్ణయం జరిగిందంటూ ఆరోపించారు. అయితే, దీని పైన సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వానికి అక్కడా చుక్కెదురైంది. ఇక, ఇప్పుడు దీనిని టీడీపీ తమ అనుకూల అస్త్రంగా మలచుకొని అధికార పార్టీ మీద ఎక్కుపెడుతోంది. వైసీపీ సైతం ఎన్నికల సంఘం నిర్ణయం మీద అవసరానికి మించి స్పందించి..ఇప్పుడు సమాధానం చెప్పుకో వాల్సిన పరిస్థితిలో నిలబడిందనే విశ్లేషణలు మొదలయ్యాయి. టీడీపీకి అవకాశం ఇచ్చేలా..వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుందనే అభిప్రాయ వ్యక్తం అవుతోంది. ఇక, తమకు అవకాశం లేకుండా స్థానిక సంస్థల ఎన్నిక ల్లో ఏకపక్ష విజయాల దిశగా దూసుకెళ్తున్న వైసీపీ స్పీడ్ కు ఇప్పుడు బ్రేకులు పడ్డాయనేది టీడీపీ నేతల అంచనా. ఎన్నికలు వాయిదా పడటంతో తాము స్థానికంగా ఎన్నికలకు సిద్దపడే సమయం దొరికిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. దీంతో..ఇప్పుడు టీడీపీలో కొత్త జోష్ కనిపిస్తోంది.
సుప్రీం తీర్పు...వైసీపీ సెల్ఫ్ గోల్ చేసుకుందా..
స్థానిక సంస్థల్లో ఏకపక్ష విజయాల దిశగా దూసుకెళ్తున్న అధికార వైసీపీకి ఎన్నికల వాయిదా బ్రేకులు వేసింది. ప్రతిపక్ష పార్టీలకు ఊపిరి సలపకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. ఎన్నికలు వాయిదా వేసే సమయానికి ఏగ్రీవాలైన స్థానాల్లో ఎక్కువగా వైసీపీ దక్కించుకున్నవే. ఇక, ఎన్నికలు జరిగినా..అధికార పార్టీకి అనుకూల పరిస్థితులు ఉంటాయని అంచనా వేసారు. అయితే, ఇప్పుడు ఎన్నికల సంఘం కరోనా కారణంగా ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేసింది. ఆ సమయంలో వైసీపీ నేతలు స్పందించిన తీరు ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితికి కారణమైందనే భావన సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతుంది. 2019 సాధారణ ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలు టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇప్పుడు ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం తమకు వ్యతిరేకంగా వస్తుందని వైసీపీ భావించింది. ఇదంతా టీడీపీ అధినేత చంద్రబాబు సూచనల మేరకు జరిగిందనే ప్రచారంతో...ఇప్పుడు టీడీపీ కేడర్ లో కొత్త చర్చ మొదలైంది. వైసీపీ ఇప్పుడు సమాధానం చెప్పాలంటూ తీర్పు వచ్చిన వెంటనే టీడీపీ నేతలు వరుస పెట్టి అధికార పార్టీని నిలదీస్తున్నారు.
టీడీపీలో కొత్త జోష్..అవకాశంగా మలచుకుంటుందా..
ఇక, అధికార వైసీపీ కొట్టిన దెబ్బకు స్థానిక ఎన్నికల్లో దాదాపు చేతులెత్తేసిన టీడీపీకి..తాజా పరిస్థితులు అనుకూలగా కనిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికల్లో జరిగిన ఘర్షణలను ప్రభుత్వ వైఫల్యంగా చిత్రీకరించి.. పరోక్షంగా చర్యల దిశగా ఎన్నికల సంఘం మీద టీడీపీ ఒత్తిడి తెచ్చింది. ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా..రిజర్వేషన్ల అంశం కారణంగా ఎన్నికలు జరగవనే భావనతో టీడీపీ...క్షేత్ర స్థాయిలో సమాయత్తం కాలేదు. అయితే, హైకోర్టు అనుమతితో ప్రభుత్వం ఎన్నికలకు సమాయత్తం కావటం..కరోనా ప్రభావం..ఎన్నికల వాయిదా.. ఇప్పుడు సుప్రీం కోర్టు తీర్పుతో ఎన్నికలు జరగటానికి మరి కొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.
Recommended Video
వ్యూహాల అమలుకు టీడీపీకి దొరికిన సమయం
దీంతో..ఇప్పుడు టీడీపీ కేడర్ ఎన్నికల్లో వైసీపీకి పోటీ ఇచ్చే విధంగా ప్రణాళికలు సిద్దం చేసుకోవటానికి వెసులుబాటు కలిగింది. అయితే, ఎన్నికలు ఎప్పుడు జరిగినా..ఫలితాలు మాత్రం వైసీపీకే అనుకూలంగా ఉంటాయని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే, వైసీపీ ఆశించిన స్థాయిలో ఏకపక్షంగా ఫలితాలు రాకుండా వారి హవాకు బ్రేకులు అయితే వేయగలుగుతామనేది టీడీపీ నేతల అంతర్గత చర్చల్లో వినిపిస్తున్న వాదన. దీంతో..ఇప్పుడు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కొత్త సీన్ దర్శనమిస్తోంది. ఈ వ్యవహారం ఎటువంటి మలుపులు తీసుకుంటుందో రానున్న ఒకటి రెండు రోజుల్లో స్పష్టత రానుంది.