ఉద్యోగ నేతలకు ఇరకాటం : అటు ప్రభుత్వం - ఇటు హైకోర్టు - న్యాయస్థానం తాజా వ్యాఖ్యలతో..!!
పీఆర్సీ సాదన కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన తీవ్రతరం చేసాయి. రేపు (గురువారం) ఛలో విజయవాడకు పిలుపునిచ్చాయి. పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా..నిర్వహించి తీరుతామంటూ ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. అటు ప్రభుత్వం నుంచి సమ్మెకు వెళ్లవద్దంటూ ఒత్తిడి పెరుగుతోంది. ఇదే సమయంలో హైకోర్టు తాజాగా చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు తర్జన భర్జన పడుతున్నారు. పీఆర్సీకి సంబంధించి ఏపీ గెజిటెడ్ అధికారుల జేఏసీ అధ్యక్షుడు కేవీ కృష్ణయ్య హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్ విచారణ సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

సమ్మె అన్నింటికీ పరిష్కారం కాదు
తమ వినతుల ఆధారంగా మళ్లీ వేతనాలను సవరించి, ఆ మేర ఉత్తర్వులు జారీచేసేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఈ పిటీషన్ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై సోమవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.అయితే, కొత్త వేతన సవరణకు సంబంధించిన పిటిషన్ న్యాయస్థానం ముందు పెండింగ్లో ఉండగా సమ్మెకు వెళ్లడమేమిటని ఉద్యోగ సంఘాలను రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది.
ప్రతీ సమస్యకూ సమ్మె పరిష్కారం కాదని చెబుతూ.. కోర్టు ముందు పిటిషన్ పెండింగ్లో ఉండగానే సమ్మెకు వెళ్లడం అంటే కోర్టుపై ఒత్తిడి తీసుకురావడమేనని.. ఇలాంటి ఎత్తుగడలను తాము అనుమతించబోమని స్పష్టంచేసింది. చట్టానికి లోబడి ఎలాంటి నిర్ణయమైనా తీసుకునే స్వేచ్ఛ అందరికీ ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సమ్మెకు వెళ్లరనే అభిప్రాయంతో
ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) తదితర అంశాల జోలికి తామిప్పుడు వెళ్లడంలేదని, ఈ దశలో వాటిపై విచారణ అవసరంలేదని ధర్మాసనం స్పష్టంచేసింది. అలాగే, ఏ ఒక్క ప్రభుత్వోద్యోగి జీతం నుంచి ఎలాంటి మొత్తాలను రికవరీ చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పీఆర్సీ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని కూడా తెలిపింది.
ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశాలతో ప్రభుత్వోద్యోగులు ఇక సమ్మెకు వెళ్లరనే భావిస్తున్నామని ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపిస్తూ.. వేతన సవరణ కోసం నియమించిన అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను ప్రభుత్వం ఇప్పటివరకు బహిర్గతం చేయలేదని.. కొత్త వేతన సవరణ జీఓ ఏకపక్షంగా ఇచ్చారన్నారు. పిటిషనర్ను కొత్త వేతన సవరణ ఏ విధంగా ప్రభావితం చేస్తోందని ధర్మాసనం ప్రశ్నించింది.

పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలంటూ
కొత్త వేతన సవరణవల్ల పిటిషనర్ జీతం తగ్గిందని, ఎలా తగ్గిందో వివరిస్తూ మెమో దాఖలు చేశానని రవితేజ తెలిపారు. జనవరిలో ఎంత వచ్చింది.. ఫిబ్రవరిలో ఎంత వచ్చిందని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ సమయంలో అడ్వొకేట్ జనరల్ శ్రీరామ్ జోక్యం చేసుకుని.. పిటిషనర్ పే స్లిప్పుతో సహా అన్ని వివరాలతో తాము ఓ మెమో దాఖలు చేశామని చెప్పారు.
పిటిషనర్ బేసిక్ పే డిసెంబర్లో రూ.51,230 ఉండగా, వేతన సవరణ తరువాత జనవరిలో అది రూ.78,820కి పెరిగిందన్నారు. మొత్తంగా అతని స్థూల జీతంలో రూ.22,432 పెరుగుదల ఉందని వివరించారు. ప్రభుత్వోద్యోగుల్లో వివిధ హోదాలకు గతంలో వచ్చిన జీతం, ఇప్పుడు పొందుతున్న జీతం వివరాలను ఆయన ధర్మాసనం ముందుంచారు. దీంతో ధర్మాసనం స్పందిస్తూ.. కరువు భత్యం, ఇంటి అద్దె భత్యం, సీసీఏ ఉపసంహరించారంటూ ధర్మాసనం ప్రశ్నించింది.
Recommended Video

ఉద్యోగ సంఘాల నేతలు ఏం చేయనున్నారు
గతంలో ఇచ్చిన మధ్యంతర భృతి, తాజాగా నిర్ణయించిన ఫిట్మెంట్కు మధ్య ఎంత మొత్తం తేడా ఉందో దాన్ని రికవరీ చేస్తామని ప్రభుత్వం అంటోందని, దీనిపైనే ఉద్యోగులు ప్రధానంగా ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంలో తాము తగిన ఆదేశాలిస్తామని ధర్మాసనం తెలిపింది. ఉద్యోగులకు నోటీసులు ఇవ్వకుండా ఎలా రివకరీ చేస్తారని ప్రశ్నించింది.
పిటిషనర్తో సహా ఏ ఉద్యోగి జీతం నుంచి ఎలాంటి మొత్తాలను రికవరీ చేయవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 23కి వాయిదా వేసింది. దీంతో..ఇప్పుడు న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు..సమ్మె పైన ప్రభావం.. తాము న్యాయపరంగా ఇబ్బందులు లేకుండా ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశం పైన ఉద్యోగ సంఘాల నేతలు మంతనాలు చేస్తున్నట్లు సమాచారం.
ఇటు ప్రభుత్వం నుంచి సమ్మె నివారణ కోసం చేస్తున్న ప్రయత్నాలు ఒత్తిడి పెంచుతున్నాయి. ఇక, ఇప్పుడు ఉద్యోగ సంఘాలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి.. ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠకు కారణమవుతోంది.












Click it and Unblock the Notifications