ఈ లేడీ భలే కిలాడి:నమ్మించి...మత్తు బిళ్లలు తినిపించి...దోచేస్తోంది
విజయవాడ:అపరిచితులకు మాయమాటలు చెప్పి బాగా నమ్మించి...ఆ తరువాత మత్తు బిళ్లలు మింగించి...ఆనక తీరిగ్గా నిలువు దోపిడి చేసేస్తోంది ఓ కిలాడీ లేడీ. విజయవాడ వన్ టౌన్ లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఆ మహిళను పోలీసులు అదుపులోకి ప్రశ్నించడంతో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి.
అది విజయవాడ వన్ టౌన్ ఏరియాలోని శివాలయ ప్రాంతం. ఆ ప్రాంతంలో ఒక గుర్తు తెలియని యువతి అనుమానాస్పదంగా తిరుగుతుండటం గమనించిన సీసీఎస్ పోలీసులు అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత తమదైన శైలిలో ప్రశ్నించేసరికి ఆ మహిళ అసలు విషయాన్ని చెప్పేసింది. తాను అపరిచితులకు మత్తు బిళ్లలు తినిపించి ఆ తరువాత దొంగతనాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించింది.
సిసిఎస్ పోలీసుల కథనం ప్రకారం...నిందితురాలు పాతిన సురేఖ అలియాస్ బుజ్జి (33) గుంటూరు జిల్లా రాజాగారి తోట వాస్తవ్యురాలు. ఒకవైపు టైలరింగ్ పని చేస్తున్నఆమెకు ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు. అయితే టైలరింగ్ పనుల మీద వచ్చే ఆదాయం ఇంట్లోకి ఏ మాత్రం సరిపోవడం లేదు. మరోవైపు భర్తకి సరైన పనులు దొరకడం లేదు. దీంతో అడ్డదారిలోనైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్న సురేఖ దొంగతనాలు చేయాలని డిసైడ్ అయింది. అయితే ఉన్న ఊళ్లో ఈ పని చేయడం కాదని భావించిన ఆమె 15 రోజుల క్రితం టెంపరరీగా విజయవాడకు మకాం మార్చింది.
అనుకున్నట్లుగానే విజయవాడ బస్టాండ్ వద్ద ఒక వృద్ధురాలికి మాయమాటలు చెప్పి, ఆటో ఎక్కించుకుని బందర్ రోడ్డులో ఉన్న ఆయుర్వేద హాస్పిటల్ దగ్గరకు తీసుకెళ్లింది. నీకు మంచి మందులు ఇప్పిస్తానని నమ్మబలికి ఆమెకు తేనెలో కలిపిన మత్తు బిళ్లలను ఆ వృద్ధురాలితో మింగించింది. ఆ తరువాత ఆమె దగ్గరున్న డబ్బులతో పాటు ఒంటిమీద బంగారం వస్తువులను కూడా అపహరించుకుపోయింది.
దీంతో ఆ వృద్దురాలు స్పృహలోకి వచ్చాక లబోదిబోమంటూ గవర్నర్పేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ రకంగా అనుకోకుండా సిసిఎస్ పోలీసులకు పట్టుబడిన సురేఖే ఆ దొంగతనం చేసిందని తెలుసుకున్న పోలీసులు సురేఖపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆమె నుంచి 112 గ్రాముల బంగారం ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.