మోడల్ ఫోటోలు చూసి మోసపోయాడు .. 7లక్షలు సమర్పించుకున్నాడు.. ఏపీలో పెళ్లి పేరుతో మోసం
అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక యువకుడికి ఓ మాయ లేడి షాకిచ్చింది. పెళ్లి చేసుకోవాలని మ్యాట్రిమోనీలో పెట్టిన అతగాడి బయోడేటా చూసింది. అమెరికాలో ఉంటాడు, ఆకర్షణీయ మైన జీతం ఉంది. ఇంకేం ఎలాగైనా బురిడీ కట్టించాలని నిర్ణయించుకున్న కిలాడీ ఆ యువకుడికి ఫోన్ చేసి తనపేరు మైనేని సముద్ర అని ప్రకాశం జిల్లా ఉలవపాడు తన స్వగ్రామం అని చెప్పింది. న్యూయార్క్ లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పి తాను గ్రీన్ కార్డ్ హోల్డర్ నంటూ పరిచయం చేసుకుంది .తనను పెళ్లి చేసుకుంటా అంటూ నమ్మబలికింది .
మోడల్ ఫోటోలు పంపి .. పెళ్లి చేసుకుంటా అని చెప్పి కిలాడీ మోసం
సదరు యువకుడు అమ్మాయిని ఫోటోలు పంపించమని అడగ్గా ఏకంగా గూగుల్ నుంచి ఒక మోడల్ ఫోటోలు డౌన్లోడ్ చేసి, రోజుకొక ఫోటో చొప్పున తన ఫోటో అంటూ పంపించడం మొదలు పెట్టింది. అవి నిజంగా తన ఫొటోలే అనుకుని అమ్మాయి అందానికి ఫిదా అయిన యువకుడు అమ్మాయి నచ్చిందని తల్లిదండ్రులకు చెప్పి, వారితో కూడా మాట్లాడించాడు. మహా ముదురు అయిన సదరు యువతి ఆమె తల్లిదండ్రులకు ఏ మాత్రం అనుమానం రాకుండా తన తల్లిదండ్రులు హై ప్రొఫైల్ కి చెందిన వారని , మద్రాసు యూనివర్సిటీలో ప్రొఫెసర్ లుగా పని చేస్తున్నారని వారిని నమ్మించింది.
అబ్బాయి తల్లిదండ్రులను బురిడీ కొట్టించిన యువతి
అమ్మాయి కుటుంబం హై ప్రొఫైల్ చూసి ఫిదా అయిన అబ్బాయి తల్లిదండ్రులు కూడా ఆ యువతికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో ఆ అమ్మాయి తండ్రితో మాట్లాడతామని కోరగా ఇక తండ్రి క్యారెక్టర్ కూడా ఎంటర్ అయ్యారు. శ్రీనివాస్ అనే వ్యక్తి తన తండ్రి అని చెప్పి అతనితో మాట్లాడించింది. ఇక ఆయన కూడా తనదైన స్టైల్ లో కట్టుకథలు చెప్పి అమ్మాయి నాయనమ్మకు ఆరోగ్యం బాగోలేని కారణంగా ఇండియాకు వచ్చిందని, మళ్లీ తిరిగి వెళ్ళిపోతుందని ఈనెల 21వ తేదీన ప్రకాశం జిల్లా ఉలవపాడుకు పెళ్లిచూపులు చూడడానికి రావాలని చెప్పారు. అదే రోజున పసుపు కుంకుమ కూడా పెట్టుకుందామని చెప్పారు.
విడతలవారీగా 7 లక్షల 20 వేల రూపాయలు వసూలు
దీంతో సరేనన్న యువకుడి తల్లిదండ్రులు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో అమ్మాయికి బంగారం ,బట్టలు కొనుగోలు చేయడానికి సమయం తక్కువగా ఉందని చెప్పి వారు అబ్బాయిని నమ్మించారు. అబ్బాయి దగ్గర నుండి విడతలవారీగా 7 లక్షల 20 వేల రూపాయలు వసూలు చేశారు. వాళ్లు అడిగినప్పుడల్లా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తూ పోయాడు యువకుడు. అయితే సంబంధం కలుపుకోవడానికి ఉలవపాడు వెళ్లేసరికి యువతితో పాటు ఆమె తండ్రిగా మాట్లాడిన వ్యక్తి ఫోన్ నెంబర్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయి.
Recommended Video
డబ్బులు గుంజి జంప్ అయిన మాయలేడి
ఇక స్థానికులను విచారించగా శ్రీనివాస్ అనే పేరుతో ఉన్న వ్యక్తి, మద్రాసు యూనివర్సిటీ లో పనిచేస్తున్న ప్రొఫెసర్ ఎవరూ లేరని వారు చెప్పారు. దీంతో మోసపోయామని గ్రహించిన అబ్బాయి కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. తెనాలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లి పేరుతో యువకుడి వద్ద డబ్బులు లాగి జంప్ అయిన మాయలాడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.