సోదరుడి సాయంతో భర్తను హత్య చేసిన మహిళ
హైదరాబాద్: కట్టుకున్న భర్తను సోదరుడి సాయంతో హత్య చేసిన మహిళను హైదరాబాదులోని దుండిగల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ సంజయ్గాంధీనగర్కు చెందిన మారుతి సత్యనారాయణను అతడి భార్య విజయలక్ష్మి తన సోదరుడి సహకారంతో చంపేసింది. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో దుండిగల్ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు.
విపరీతంగా మద్యం తాగుతుండడంతో విసిగిపోయిన మహిళ ఆ పనికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. తన భర్త హత్యకు సోదరుడు రాముకు ఆమె 5 వేల రూపాయలు ఇచ్చింది. సత్యనారాయణ హత్యకు రాము నలుగురు మిత్రుల సాయం తీసుకున్నాడు. విజయలక్ష్మి చెప్పిన సమాచారంతో పోలీసులు బహదుర్పల్లిలో కుళ్లిన స్థితిలో ఉన్న సత్యనారాయణ శవాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మెదక్జిల్లా గాంధారీ పల్లికి చెందిన ఎం.సత్యనారాయణ (38)కు మొదటి భార్యతో విడాకులైంది. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన విజయలక్ష్మితో పదేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు సంతానం. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి షాపూర్నగర్లోని సంజయ్గాంధీనగర్లో ఉంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని సత్యనారాయణ పోషిస్తున్నాడు.
గత నెల 30న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటువేయడాని స్వగ్రామానికి వెళ్లాడు. అనంతరం సంజయ్గాంధీనగర్కు వచ్చాడు. అయితే ఈ నెల ఒకటి నుంచి సత్యనారాయణ కనిపించకుండా పోయాడు. అతడి సోదరుడు పలుసార్లు సెల్ఫోన్కు కాల్ చేసినా స్విచ్ఛాఫ్ వచ్చింది. ఈ నెల 8న మరోసారి కాల్ చేసినా స్పందించకపోవడం, విజయలక్ష్మి పొంతనలేని మాటలు మాట్లాడుతుండడంతో స్వగ్రామానికి పిలిపించారు. పెద్దల సమక్షంలో నిలదీయడంతో హత్య చేయించినట్టు విజయలక్ష్మి అంగీకరించింది. పోలీసుల అదుపులో కూడా ఆ విషయం చెప్పింది.
తన సోదరుడు రాముకు కొంత నగదు ఇచ్చి హత్య చేయమని కోరినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో రాముతో పాటు మరో ఐదుగురు ఈ నెల 1వ తేదీన పని ఉందంటూ తీసుకెళ్లి బహదూర్పల్లి చౌరస్తాలోని సాయినాధ్ సొసైటీ చెట్లపొదల్లో సత్యనారాయణను హత్య చేశారు. అనంతరం ఎవరి ప్రాంతాలకు వారి వెళ్లిపోయారు. ఈ విషయం తనకేమి తెలియనట్టు విజయలక్ష్మి వ్యవహరించింది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం గాలిస్తున్నారు.