టపాకాయ నిప్పురవ్వ పడి గుడిసె దగ్ధం: మహిళ మృతి
ఎర్రమంజిల్ కాలనీలోని రామకృష్ణా నగర్లో సంగమేశ్వర్ అనే వ్యక్తి నివసిస్తున్నారు. ఆయన సతీమణి నాగమణి. ఈమె తన భర్త, కుమారుడు మురళీ మోహన్, కోడలుతో కలిసి నివసిస్తున్నారు. భర్త సంగమేశ్వర్ పని మీద బాచుపల్లి వెళ్లగా, కొడుకు దీపావళి పండుగ కోసం అత్తవారింటికి వెళ్లారు. దీంతో శనివారం రాత్రి గుడిసలో నాగమణి ఒక్కరే ఉన్నారు.
శనివారం అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తూ నిప్పు రవ్వలు వచ్చి గుడిసె పైన పడినట్లుగా భావిస్తున్నారు. గుడిసె మంటల్లో చిక్కుకోవడంతో నాగమణి మృతి చెందారు. స్థానికులు నీళ్లు పోసి మంటలను ఆర్పే ప్రయత్నాలు చేశారు. కొడుకు మురళీ మోహన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మరోవైపు టపాసులు కాల్చుతుండగా మెహదీపట్నం ప్రాంతంలో పద్దెనిమిది మంది పిల్లలు గాయపడ్డారు. వారికి చికిత్స చేశారు. ఓ చిన్నారి కంటిగా గాయం కావడంతో అతనికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.