కొడుకూకూతురు గొంతు కోసిన మహిళ: ఆత్మహత్యాయత్నం
అనంతపురం: ఓ మహిళ చురకత్తితో తన కొడుకు, కూతురు గొంతు కోసి ఆపై ఆమె గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన సోమవారం అనంతపురం జిల్లాలోని నూతిమడుగులో చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.
నూతిమడుగు గ్రామానికి చెందిన మారుతి బిఎస్ఎఫ్ జవాన్గా దేశ సరిహద్దులో పని చేస్తున్నాడు. అతడికి ఆరేళ్ల క్రితం సునీతతో వివాహం జరిగింది. వారికి కుసుమ(4), రుషి(3) సంతానం. మారుతి విధి నిర్వహణలో భాగంగా భార్య సునీతతో పాటు ఇద్దరు పిల్లలను గ్రామంలోని ఆడబిడ్డ ఆదెమ్మ వద్ద వదిలి వెళ్లాడు.
కాగా, సునీత సోమవారం సాయంకాలం ఇంట్లో వున్న చురకత్తితో తన ఇద్దరు పిల్లల గొంతు కోసి దారుణంగా హత్య చేసింది. అనంతరం తాను గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన స్థానికులు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతోన్న సునీతను రాయదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విగత జీవులుగా పడి వున్న ఇద్దరు చిన్నారులను చూసి స్థానికులు తీవ్రంగా చలించిపోయారు. అయితే భర్త తమను తనతో పాటు తీసుకెళ్లలేదని మనస్థాపానికి గురై ఈ చర్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.