మద్యం తాగి మహిళపై కానిస్టేబుల్ అత్యాచారం చేసి రోడ్డుపై పడేశాడు
గుంటూరు: రక్షకభటుడే భక్షకుడైన సంఘటన గుంటూరులో చోటు చేసుకుంది. ఓ కానిస్టేబుల్ మహిళపై అత్యాచారం చేశాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను అర్ధరాత్రి సమయంలో రోడ్డుపై పడేసి వెళ్లిపోయాడు. స్థానికులు గమనించి ఆమె చనిపోయిందనుకుని డయల్ 100కు సమాచారం అందించారు. దాంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సపర్యలు చేయగా స్పృహలోకి వచ్చింది.
తనపై కానిస్టేబుల్ ప్రవర్తించిన తీరు, కొట్టి అత్యాచారం చేసిన వైనాన్ని ఆమె పోలీసులకు చెప్పింది. రక్షక్ వాహనంలో వెళ్లిన సిబ్బంది ఈ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడుతూ ఆమెకు నచ్చజెప్పి ఇంట్లో దింపి వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న అర్బన్ ఎస్పీ త్రిపాఠి ప్రత్యేక దర్యాప్తు చేయాలని ఏఎస్పీ భాస్కర్రావును ఆదేశించారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ను సోమవారం ఎస్పీ కార్యాలయానికి పిలిపించి రహస్యంగా విచారణ చేపట్టారు.ఏపీఎస్పీలో కానిస్టేబుల్గా పనిచేసిన నిందితుడు ఇటీవల సివిల్ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. మేడికొండూరు ఠాణాలో పనిచేస్తున్న క్రమంలో ఇసుక అక్రమ రవాణాకు సహకరిస్తున్నాడనే ఆరోపణలపై అధికారులు అతడిని సస్పెండు చేశారు.
కొద్దిరోజుల తర్వాత గుంటూరు నగరంలో పోస్టింగ్ తెచ్చుకున్నాడు. ఓ సీఐ వద్ద గన్మన్గా పనిచేస్తున్న క్రమంలో గుంటూరు శ్రీనివాసరావుపేటకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో కనుమ పండుగ రోజున మద్యం తాగి ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమెపై దాడి చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు.