గర్భిణీతో నర్సుల చెలగాటం .. గర్భసంచి బయటకు ..బిడ్డను చూడకుండానే తల్లి మృతి
ఏపీలో ఒకపక్క కరోనా మహమ్మారి ప్రతాపం చూపిస్తున్న వేళ వైద్యులు అహర్నిశలు కరోనా నుండి బాధితులను కాపాడే ప్రయత్నం చేస్తూ అందరితో శభాష్ అనిపించుకుంటుంటే మరోపక్క కొందరు వైద్యుల నిర్వాకం , వైద్యం చెయ్యటంలో నిర్లక్ష్యం వెరసి నిండు ప్రాణాలు పోతున్నాయి . ఇక తాజాగా ఒక గర్భిణీ విషయంలో వైద్య సిబ్బంది నిర్వాకం తో గర్భిణీ రెండు రోజులు ప్రాణాల కోసం పోరాడి కన్నుమూసింది.
పెరుగుతున్న మూఢ నమ్మకాలు ... కరోనా రాదని చిత్తూరు జిల్లాలో సామూహిక పూజలు
గర్భిణీకి డెలివరీకి యత్నం చేసిన నర్సులు .. గర్భసంచి బయటకు వచ్చిన ఘటన
పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చిన మహిళకు డెలివరీ చెయ్యాల్సిన వైద్యులు లేకపోవటంతో నర్సులు కాన్పు చెయ్యటానికి ప్రయత్నించిన ఘటన ఉయ్యూరులో చోటు చేసుకుంది. పెద్ద ఓగిరాలకు చెందిన గర్భిణికి గైనకాలజిస్టు లేకుండానే నర్సులే కాన్పుకు యత్నించారు. కాగా కాన్పు సమయంలో గర్భసంచి బయటకు రావడంతో మా వల్ల కాదని, కండీషన్ సీరియస్ అని చెప్పి విజయవాడకు తరలించి నర్సులు చేతులు దులుపుకున్నారు.
రెండు రోజులు పోరాడి మృతి చెందిన తల్లి
అయితే రెండు రోజులుగా విజయవాడ ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడిన ఆ తల్లి తన కన్న బిడ్డను కూడా కళ్ళారా చూడకుండానే ప్రాణాలు విడిచింది. వైద్యుల నిర్లక్ష్యం ఖరీదు ఒక నిండు ప్రాణం అని మహిళ తరపు బంధువులు లబోదిబోమంటున్నారు . ఒకపక్క కరోనా కంట్రోల్ కోసం వైద్యులు అహర్నిశలు పని చేస్తున్నా మరోపక్క మిగతా వైద్య సిబ్బంది వైద్య చికిత్సల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు గర్భిణీ స్త్రీలకు శాపంగా మారుతుంది. కరోనా తీవ్రమైన ఉపద్రవమే అయినా కరోనా కేసుల గురించి మాత్రమే పట్టించుకుంటారా ? మిగతా వారి ప్రాణాలు అరాకొరా వైద్యంతో గాలిలో కలిసిపోయినా పరవాలేదా అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు .
Recommended Video
తల్లి విగతజీవిగా మారటంతో అనాధలైన చిన్నారులు
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు సరిగా లేకపోవటం , నర్సులు, వైద్య సిబ్బంది నిర్వాకం వెరసి ఓ తల్లి ప్రాణాలు పోగొట్టుకుంది . డెలివరీకి వెళ్ళిన మహిళ కండిషన్ ఎలా ఉంది. కడుపులో బిడ్డ ఎలా ఉంది అన్న అంశాలు చూడకుండానే నిర్లక్ష్యంగా నర్సులు చేసిన నిర్వాకంతో గర్భసంచి బయటకు వచ్చింది. దీంతో విజయవాడ తరలించినా ఫలితం లేకపోయింది. తల్లి విగతజీవిగా మారటంతో అమ్మ కోసం విలవిలలాడుతున్న మూడేళ్ళ పెద్ద కూతురు, పొత్తిళ్లలో పసికందును చూసి గ్రామస్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు.