ఏపీలో వరుస అత్యాచారాలపై మహిళా కమీషన్ సీరియస్..వారికి చెమటలు పట్టిస్తూ.. ఏం చేస్తుందంటే!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకున్న అత్యాచార ఘటనలను ఏపీ మహిళా కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా చోటు చేసుకున్న వరుస అత్యాచారాల నేపథ్యంలో రంగంలోకి దిగిన ఏపీ మహిళా కమిషన్ అత్యాచారాలు జరిగిన ప్రాంతాలలో సంబంధిత శాఖల నుండి మహిళల భద్రతకు సంబంధించి వివరణ ఇవ్వాలని లేఖలు రాసింది.
ఏపీలో అత్యాచార ఘటనలను సీరియస్ గా తీసుకున్న మహిళా కమీషన్
రేపల్లె రైల్వే స్టేషన్ అత్యాచార ఘటన పై స్పందించిన ఏపీ మహిళా కమిషన్ రైల్వే స్టేషన్ వంటి పబ్లిక్ ప్లాట్ఫారం మీద, అది కూడా భద్రతా సిబ్బంది ఉండే ప్రాంతంలో మహిళ అత్యాచారానికి గురవ్వటాన్ని సీరియస్ గా తీసుకుంది. ప్రకాశం జిల్లా నుండి పొట్ట చేత పట్టుకుని వచ్చిన మహిళపై కట్టుకున్న భర్త, కన్నబిడ్డల ముందే కొందరు మృగాళ్లు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన పై స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ రైల్వే స్టేషన్లలో భద్రతా లోపంపై రైల్వే శాఖ అధికారులను వివరణ కోరినట్లు తెలిపారు.
ఘటనలకు సంబంధించి నివేదిక అందించాలని సంబంధిత శాఖలకు ఆదేశం
తమకు ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి నివేదిక అందించాలని కోరామని పేర్కొన్నారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్నామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామంటూ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ వెల్లడించారు. సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం, రైల్వే పోలీస్, ఎస్పీలకు మహిళా కమిషన్ లేఖలు రాసిందని తెలిపారు. ప్లాట్ ఫామ్ ల మీద మహిళలకు ప్రత్యేకంగా వెయిటింగ్ రూమ్, లైటింగ్, సీసీ కెమెరాలు, వాష్ రూమ్ వంటి సౌకర్యాలపై రైల్వే శాఖ తీసుకున్న చర్యలను వివరించాలని కోరామని వెల్లడించారు.
జాతీయ మహిళా కమీషన్ దృష్టికి అత్యాచార ఘటనలు
అటు గుంతకల్లు డివిజన్ లో కూడా రైల్వే శాఖ పోలీసుల ఆధ్వర్యంలో స్టేషన్ పరిధిలో గస్తీ, అనుమానితుల తనిఖీలు, ప్లాట్ ఫామ్ మీద ఫిర్యాదులు చేయడానికి బాక్సులు ఏర్పాటు తదితర అంశాలకు సంబంధించి వివరణ ఇవ్వాలని కోరుతూ ఎస్పీ కి లేఖ రాశామని పేర్కొన్నారు. సంబంధిత అధికారులు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని లేఖలో తెలిపామని వెల్లడించారు. అత్యాచారాలు జరిగిన ప్రాంతాల సంబంధిత శాఖల అధికారులకు చెమటలు పట్టిస్తున్నారు.గురజాల రైల్వే హాల్ట్ లో, అలాగే రేపల్లె రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటనలను జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకువెళుతూ లేఖలు రాశారు.
కేంద్ర రైల్వే శాఖను అప్రమత్తం చెయ్యాలని మహిళా కమీషన్ చైర్ పర్సన్ లేఖ
ఇలాంటి ఘటనలపై కేంద్ర రైల్వేశాఖను అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ లేఖలో కోరారు. పబ్లిక్ ప్రదేశాలలో రాష్ట్రంలో జరుగుతున్న వరుస అత్యాచారాల నేపథ్యంలో రంగంలోకి దిగిన మహిళా కమిషన్ ఈ ఘటనలపై సంబంధిత అధికారులు వివరణ కోరడంతో పాటు, ఈ ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశించనున్నారు. వరుస అత్యాచారాల నేపధ్యంలో మహిళల భద్రత విషయంలో పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంది మహిళా కమీషన్.