నీళ్ల కోసం: మరదలిపై బావ దాష్టీకం, స్మార్ట్ఫోన్లో వీడియో తీసిన కొడుకు
చిత్తూరు: ఏపీలోని చిత్తూరు జిల్లాలో దారుణం వెలుగు చూసింది. మరదలి పైన ఓ బావ దాడికి పాల్పడ్డాడు. కాలితో తన్నాడు. చేయి చేసుకున్నాడు. దారుణంగా కొట్టిన ఈ వీడియో దృశ్యాలు బాధితురాలి తనయుడు స్మార్ట్ ఫోన్ ద్వారా వీడియో తీసి పోలీసులకు అందించాడు.
ఈ సంఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం అబ్బవరంలో జరిగింది. గ్రామానికి చెందిన నాగభూషణం, శ్రీనివాసులు అన్నదమ్ములు. వీరికి ఒకే బోరు బావి కింద వ్యవసాయం ఉంది. వీరికి తరుచూ నీటి కోసం గొడవ జరుగుతుండేది. నాగభూషణం అన్న. శ్రీనివాసులు తమ్ముడు.
సమాచారం మేరకు... శ్రీనివాసులు తన వంతు నీటి కోసం నిత్యం తన అన్నను అడుగుతుండేవాడు. ఈ సందర్భంగా పలుమార్లు శ్రీనివాసులు పైన దాడి జరిగింది.
శ్రీనివాసులు భార్య ఇలాగే నీటి కోసం అడిగేందుకు వెళ్లంది. అయితే, బావ ఆమెను చితకబాదినట్లుగా వీడియో ఉంది. ఆమెను తన్నాడు. కొట్టాడు. ఈ సమయంలో మామ, ముగ్గురు స్నేహితులు అక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది.
దీనిని బాధితురాలి కొడుకు చంద్రశేఖర్ తన స్మార్ట్ ఫోన్ సాయంతో వీడియో తీశాడు. దీనిని పోలీసులకు అందించాడు. దీంతో, పోలీసులు నిర్భయ కింద కేసు నమోదు చేశారు. బావకు పలుకుబడి ఉండటం వల్లనే ఇలా చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఇది కుటుంబ వ్యవహారం అయినందున, పోలీసుల వద్దకు వెళ్లవద్దని పలువురు సూచించినప్పటికీ.. కొడుకు చంద్రశేఖర్ మాత్రం తమకు న్యాయం చేయాలని కోరారు.