రాజధానికి వరల్డ్ బ్యాంక్ సాయం 5వేల కోట్లు: వెలగపూడికి చంద్రబాబు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఓ శుభవార్త. రాష్ట్ర విభజన తర్వాత కనీస వసతులు లేకుండా 13 జిల్లాలతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కు రాజధాని లేకుండా పోయింది. అయితే రాజధానికి నిధులిచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతుంది.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి పలు ప్రతిపాదనలు అందుకున్న వరల్డ్ బ్యాంక్ రుణమిచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు వరల్డ్ బ్యాంక్ గురువారం ఓ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలి విడతగా రూ.5 వేల కోట్ల రుణమిచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఈ రుణం చెల్లింపునకు దీర్ఘకాల పరిమితి ఉన్న నేపథ్యంలో దానిని స్వీకరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మూడు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతిలోని పరిస్థితులపై సమగ్ర పరిశీలన జరిపింది. అధికారులతో కీలక చర్చలు నిర్వహించారు.
ఈ క్రమంలోనే రుణాన్ని అందించేందుకు వరల్డ్ బ్యాంకు నుంచి సానుకూలత వ్యక్తమైనట్లు సమాచారం. ఈ రుణ చెల్లింపునకు 30 నుంచి 40 ఏళ్ల కాలపరిమితి ఉండటంతో రుణం తీసుకునేందుకు చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం కూడా అంగీకరించిందని అధికారులు చెబుతున్నారు.
ఇది ఇలా ఉంటే ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం గుంటూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండకు చంద్రబాబు రానున్నారు. కోటప్పకొండలో కొత్తగా ఏర్పాటు కానున్న కాపు సత్రానికి ఆయన భూమి పూజ చేస్తారు.
మరోవైపు కోటప్పకొండలో పలు అభివృద్ధి కార్యక్రమాలనకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. కోటప్పకొండ పర్యటనను పూర్తి చేసుకున్న తర్వాత అటు నుంచి అటే రాజధాని ప్రాంతంలోని వెలగపూడికి బయల్దేరతారు.
కాగా వెలగపూడిలో ప్రస్తుతం తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల పరిశీలన కోసమే చంద్రబాబు అక్కడికి వెళ్తున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని జూన్లోపు పూర్తి చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 200 కోట్లు ఖర్చు చేస్తోంది.
తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులను షాపూర్ పల్లోంజీ, ఎల్ అండ్ టీ సంస్ధలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వెలగపూడి ప్రాంతంలో మూడు షిప్టుల్లో కార్మికులు పనులను పూర్తి చేస్తున్నారు. భారీ యంత్రాల సాయంతో తాత్కాలిక సచివాలయ నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు. వెలగపూడి పర్యటన తర్వాత ఆయన తిరిగి రాత్రికి విజయవాడకు చేరుకుంటారు.