ఆసక్తికరం, మెచ్చుకుంటున్నారు: బాబుతో కేటీఆర్ ప్రత్యేకంగా, లోకేష్-గల్లా జయదేవ్లతోనూ
దావోస్: స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, ఏపీ మంత్రి నారా లోకేష్, ఎంపీ గల్లా జయదేవ్లు కలిసి ఫోటోకు ఫోజులు ఇచ్చారు.
Recommended Video
నాశనం చేసుకుంటున్నాం, ఇదీ ఇండియా!: దావోస్లో మోడీ, టెక్నాలజీ-ఉగ్రవాదంపై ఇలా
దావోస్లో చంద్రబాబుతో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నారా లోకేష్తోను భేటీ అయ్యారు. లోకేష్కు కేటీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కేటీఆర్, లోకేష్ సమావేశంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కోసం వీరు ప్రస్తుతం దావోస్లో ఉన్నారు.
సీఐఐ సదస్సుకు ఆహ్వానించిన చంద్రబాబు
అంతకుముందు, దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు మంగళవారం సౌదీ ఆర్మ్కో ఇంటర్నేషనల్ ఆపరేషన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ సైద్ ఎ అల్ హద్రమీతో సమావేశం అయ్యారు. పెట్రోలియం రిఫైనరీ రంగంలో సౌదీ ఆర్మ్కో ప్రసిద్ధి చెందినది. గతంలో సౌదీ ఆర్మ్కోతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఏపీలో చమురు, సహజవాయు నిక్షేపాలు అపారంగా ఉన్నాయని, ఏపీలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. విశాఖలోని సీఐఐ సదస్సుకు చంద్రబాబు ఆహ్వానించారు.
అందరూ మెచ్చుకుంటున్నారు
వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనడం గొప్ప అవకాశమని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఇందులో పాల్గొనడం ద్వారా భారత్కు ఎన్నో లాభాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలపై ఈ సమావేశంలో వివరిస్తామని చెప్పారు. వివిధ దేశాల ప్రతినిధులతో అభిప్రాయాలు పంచుకునే అవకాశం వచ్చిందన్నారు. ఏపీలో రియల్ టైమ్ గవర్నెన్స్ గురంచి అందరూ మెచ్చుకుంటున్నారని చెప్పారు.
బిజినెస్ బ్రేక్ ఫాస్టులో లోకేష్
ఏపీలో పారిశ్రామిక అభివృద్ధికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ వేరుగా అన్నారు. బిజినెస్ బ్రేక్ ఫాస్ట్ సమావేశం ప్యానెల్ డిస్కషన్లో లోకేష్ మాట్లాడారు. ఏపీలో ఎలక్ట్రానిక్స్, సోలార్ రంగాల్లో క్లస్టర్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. విశాఖ - చెన్నై, బెంగళూరు - చెన్నై కారిడార్లు వస్తున్నాయని తెలిపారు. నీటి వనరులు కల్పించడం వల్ల అనంతపురంకు కియా పరిశ్రమ, ఆటోమొబైల్స్ పరిశ్రమలు వచ్చాయన్నారు.
ఎన్నారైలు దశదిశలా చాటాలి
అంతకుముందు రోజు కేటీఆర్ ఎన్నారైలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటు నాటి అయోమయ పరిస్థితి నుంచి తమ ప్రభుత్వం అద్భుతమైన ప్రగతిదిశగా రాష్ట్రాన్ని తీసుకుపోతోందని చెప్పారు. బంగారు తెలంగాణ కల సాకారంలో ప్రవాస తెలంగాణవాసులు కలిసి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లలో సాధించిన అద్భుతమైన ప్రగతిని ఎన్నారైలు దశదిశలా చాటాలని కోరారు.
ఎన్నారైలది కీలక పాత్ర
ప్రతి తెలంగాణ ప్రవాస భారతీయుడు రాష్ట్రానికి ఒక గుడ్విల్ అంబాసిడర్, బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా రాష్ట్రాన్ని ఇతర దేశాల్లోని ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలకు పరిచయం చేసేందుకు, ఆసక్తిగల పారిశ్రామికవేత్తలను తెలంగాణ ప్రభుత్వంతో అనుసంధానం చేసేందుకు ఎన్నారై మిత్రులు కలిసి రావాలన్నారు. నాడు తెలంగాణ ఉద్యమంలో, నేడు సొంత రాష్ట్రంలో ఎన్నారైలది కీలక పాత్ర అన్నారు. ఆయన జ్యూరిచ్ నగరంలో తెలంగాణ ఎన్నారైల సమావేశంలో పాల్గొన్నారు.