ఎపి సిఎం చంద్రబాబుకు..."ద న్యూయార్క్ టైమ్స్" ప్రశంసలు:ఏ విషయంలోనంటే?
అమరావతి: ఒక ప్రత్యేక అంశానికి సంబంధించి చంద్రబాబు వేసిన ఒక ముందడుగు...చేసిన కృషి ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు తెచ్చిపెట్టాయి. ఆ విషయంలో ఎపి సిఎం చర్యలను "ద న్యూయార్క్ టైమ్స్" అనే అంతర్జాతీయ పత్రిక ప్రశంసించింది. ఇంతకూ ఆ అంశం ఏమిటంటే..."సేంద్రీయ సాగు"
సేంద్రీయ సాగు విషయంలో ఆంధ్రప్రదేశ్ చేసిన కృషి ఇప్పుడు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఆర్గానిక్ కల్టివేషన్ కోసం చంద్రబాబు తీసుకున్న చర్యలపై పర్యావరణవేత్తలు అభినందిస్తున్నారు. అంతేకాదు ప్రకృతి సిద్ధంగా వ్యవసాయం చేసేలా రైతులను ప్రోత్సహించేందుకు చంద్రబాబు తీసుకొచ్చిన జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్పై న్యూయార్క్ టైమ్స్ ఆయనను ప్రశంసిస్తూ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది.
వ్యవసాయం అంటేనే...అలా మారింది
కొన్ని దశాబ్దాలుగా వ్యవసాయం అనగానే పెద్దమొత్తంలో ఎరువుల వాడకం, విచ్చలవిడిగా క్రిమిసంహారక మందులు-రసాయనాలు వినియోగించడం అన్న చందంగా మారిపోయింది. ఇక గత కొన్నేళ్లుగా ఈ ధోరణి పతాక స్థాయికి చేరిపోయింది. వీటి వినయోగం వల్ల దిగుబడి సంగతేమో కానీ పర్యావరణంపై, మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. విచ్చలవిడిగా కెమికల్స్ ను వాడటం వల్ల అటు రైతులు...ఇటు వినియోగదారులు తీవ్ర అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. వాటికి తోడు సాగుదారులకు అమితమైన ఖర్చు...ప్రత్యేకించి వీటికోసం పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరిగిపోయి రైతులు అప్పులు పాలవుతున్నారు.
Recommended Video
పరిష్కారం వైపు...చంద్రబాబు
అందుకే ఈ పరిస్థితి మార్చాలనుకున్న సిఎం అందుకు పరిష్కారంగా సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గు చూపారు. రసాయనాలు లేకుండా సాగుకు ముందడుగు వేశారు. ప్రకృతి సిద్ధంగా సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలనుకున్నారు. ఆ క్రమంలో ప్రకృతి వ్యవసాయ నిపుణుడు సుభాష్ పాలేకర్ సూచనలతో జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు. రైతు సాధికార సమితిల సాయంతో రైతులను సేంద్రీయ సాగు వైపు మళ్లించారు. తక్కువ కాలంలోనే ఏపీలోని రైతులు జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వైపు మొగ్గు చూపారు. ఏపీ రైతులను ప్రకృతి సిద్ధమైన సాగు వైపు నడిపించిన చంద్రబాబు కృషి ఇప్పుడు ఆయనకు సర్వత్రా ప్రశంసలు తెలచ్చిపెడుతోంది.
అంతర్జాతీయ స్థాయిలో...ప్రశంసలు
ఎపి ఆర్గానిక్ కల్టివేషన్ పై తొలుత ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ప్రత్యేక కథనం ప్రచురించింది. దేశంలోనే ఏపీ మొట్టమొదటి జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ స్టేట్ అంటూ అందులో కితాబునిచ్చింది. ఆ తరువాత తాజాగా న్యూయార్క్ టైమ్స్లోనూ సీఎం చంద్రబాబు నూతన విధానంపై ప్రత్యేక కథనం ప్రచురితమైంది. వ్యవసాయాన్ని ప్రకృతికి చేరువ చేయాలంటూ వెలువడ్డ ఆ కథనంలో ఆంధ్రప్రదేశ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతేకాదు సీఎం చంద్రబాబు కృషిని కొనియాడారు. ప్రకృతి సిద్ధమైన సేద్యం కోసం ఏపీ ప్రభుత్వం సుమారు రూ.2500 కోట్లు వెచ్చిస్తోందంటూ ఆ కథనంలో వివరించారు. ఈ నిర్ణయంతో రైతులు అప్పులు పాలు కారని విశ్లేషించారు. అంతేకాదు సుమారు లక్ష మంది రైతులు జీరో బడ్జెట్తో సహజసిద్ధంగా సాగు చేస్తున్నారని వెల్లడించింది. ఇక ఈ ఏడాది చివరికి 5 లక్షల మంది...రాబోయే ఐదేళ్లలో 60 లక్షల మంది రైతులు ఈ విధంగానే సేంద్రీయ వ్యవసాయానికి మొగ్గు చూపే అవకాశం ఉందని ఆ కథనంలో పేర్కొంది.
ఎపి స్పూర్తితో...మరిన్ని రాష్ట్రాలు
ఎపి ప్రభుత్వం జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్పై న్యూయార్క్ టైమ్స్లో ప్రత్యేక కథనం రావడం దేశవ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే నేచురల్ ఫార్మింగ్ను ఇతర రాష్ట్రాలు కూడా అనుసరిస్తున్నాయి. పొరుగు రాష్ట్రమైన కర్ణాటక ఏపీ బాటలోనే నడిచేందుకు సంసిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ను కర్ణాటకలో పైలెట్ ప్రాజెక్ట్గా తీసుకోవడం జరిగింది. పర్యావరణహితంగా సాగే ఈ తరహా సాగుపై ఇప్పుడు మిగతా రాష్ట్రాల దృష్టి కూడా పడింది. మొత్తంగా ఏపీ సీఎం చంద్రబాబు సేంద్రీయ సాగు విషయంలో ఒక ముందడుగు వేస్తే ఇపుడు మిగతా రాష్ట్రాలు అదే బాటలో నడిచేందుకు సిద్ధమవుతున్నాయని టిడిపి శ్రేణులు అభివర్ణిస్తున్నాయి.