ఏపీలో మళ్లీ తెరపైకి 75 శాతం స్ధానిక కోటా- రాజ్యాంగబద్ధతను ప్రశ్నించిన హైకోర్టు...
ఏపీలోని పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్ధానిక యువతకే లభించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ బద్దతను సవాల్ చేస్తూ ఇవాళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విజయవాడకు చెందిన న్యాయవాది వరలక్ష్మి ఈ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరఫున సుమంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా పారిశ్రామికవేత్తలు కాకుండా న్యాయవాదులు, ఇతరులు ఎలా పిటిషన్ దాఖలు చేస్తారని సుమంత్ రెడ్డి ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. అయితే ప్రజా ప్రయోజనం ఇమిడి ఉన్నందున కేసును విచారణకు స్వీకరించినట్లు చెప్పిన హైకోర్టు ధర్మాసనం.... నెల రోజుల్లో ప్రభుత్వం వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చింది.
Recommended Video
ఏపీలో గతేడాది అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్ధానిక యువతకే కేటాయిస్తూ చారిత్రక చట్టాన్ని తీసుకొచ్చింది. దీనిపై రాష్ట్రంలో అంతగా అభ్యంతరాలు కూడా వ్యక్తం కాకపోవడంతో అసెంబ్లీలోనూ సజావుగానే ఆమోదం లభించింది. ఆ తర్వాత ఇదే నిర్ణయాన్ని కర్ణాటకతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేశాయి. ఉద్యోగాలు దొరకడమే గగనమైపోతున్న తరుణంలో స్ధానికులకు భరోసానిస్తూ తీసుకొచ్చిన ఈ చట్టంపై ఇప్పటివరకూ ఎలాంటి అభ్యంతరాలూ వ్యక్తం కాలేదు. కానీ తాజా పిటిషన్ నేఫథ్యంలో హైకోర్టు దీని చట్టబద్ధతను ప్రశ్నించడంతో మరోసారి ఈ వ్యవహారం చర్చనీయాంశమవుతోంది.