ఆ హామీపై చేతులెత్తేసిన జగన్ .. వైసీపీ ఎంపీలు రాజీనామా చెయ్యండి : యనమల డిమాండ్
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు నిప్పులు చెరిగారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా తీసుకొస్తామన్న హామీ ఇచ్చి యువతను మోసం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా తీసుకురావడం చేతకాదని చేతులెత్తేసిన జగన్ ప్రజలను దగా చేశారని దుయ్యబట్టారు యనమల రామకృష్ణుడు.
కేంద్రం ముందు సీఎం జగన్ మోహన్ రెడ్డి మోకరిల్లాడు అని పేర్కొన్న యనమల సీబీఐ, ఈడీ కేసులతో జగన్ కేంద్ర ప్రభుత్వానికి లొంగిపోయారని విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ వ్యవహారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, యువతకు తీవ్ర నష్టం వాటిల్లిందని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2020 21 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక ఆర్థిక అభివృద్ధి దిగజారిపోయింది అని విమర్శించిన యనమల నిరుద్యోగ రేటు విపరీతంగా పెరిగిపోయింది అన్నారు.
Recommended Video
ప్రస్తుతం ఏపీలో నిరుద్యోగ రేటు 13.5 శాతం పెరిగిందని పేర్కొన్న ఆయన ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం ఇప్పటివరకు చేసిందేమీ లేదన్నారు. ప్రోత్సాహకాలు లేక రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదని యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడలేని వైసీపీ ఎంపీలతో ఉపయోగం లేదని పేర్కొన్న యనమల, వాళ్లంతా వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదా విషయంలో హామీ ఇచ్చి జగన్ పెద్ద మోసం చేశాడని,యువతను దగా చేశారని యనమల రామకృష్ణుడు ఫైర్ అయ్యారు.