అవసరం తీరేవరకే అన్న.. అవసరం తీరాక దున్న అన్నట్లు జగన్ వైఖరి: యనమల ఫైర్
ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ బదిలీ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపింది. డీజీపీ గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేయడం పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతమైన తరువాత గౌతమ్ సవాంగ్ ను బదిలీ చేస్తారని వార్తలు వచ్చాయి. ఇక తాజా ఉత్తర్వులతో అవి నిజమని తేలింది. సీఎం పేషీలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ పై బదిలీ వేటు పడి 24 గంటలు కూడా పూర్తికాకుండానే, రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీ వేటు పడటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
అవమానకర రీతిలో డీజీపీ పదవి నుండి గౌతమ్ సవాంగ్ ను గెంటేశారు: యనమల
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులను వాడుకొని వదిలేయడం లో జగన్ టాప్ అంటూ ఆయన విరుచుకుపడ్డారు. అవమానకర రీతిలో డీజీపీ పదవి నుండి గౌతమ్ సవాంగ్ ను గెంటేశారు అని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అవసరం తీరేవరకూ అన్నా.. అవసరం తీరాక దున్నా అన్నట్టు జగన్ వైఖరి ఉందని అసహనం వ్యక్తం చేశారు.
జగన్ నైజాన్ని ఇప్పటికైనా ఉద్యోగుల అర్థం చేసుకోవాలి: యనమల
డీజీపీ స్థాయి కి పోస్టింగ్ ఇవ్వకుండా అవమానించారని, గతంలో సిఎస్ ఎల్ వి సుబ్రహ్మణ్యం ను అన్నా అంటూనే గెంటేశారు అని, పి వి రమేష్, అజయ్ కల్లాంలకు పొమ్మనకుండా పొగ బెట్టారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. అజయ్ కల్లాంతో న్యాయమూర్తులపై విషం కక్కించారని, ఆ తర్వాత పంపేశారని మండిపడ్డారు. చీకటి జీవోలకు ఆద్యుడైన ప్రవీణ్ ప్రకాష్ ను ఆకస్మికంగా ఢిల్లీకి తరిమికొట్టారన్నారు. పోలీసుల పట్ల జగన్ రెడ్డి వ్యవహారం దుర్మార్గమని ఆయన అసహనం వ్యక్తం చేశారు. జగన్ వ్యవహారశైలిని, జగన్ నైజాన్ని ఇప్పటికైనా ఉద్యోగుల అర్థం చేసుకోవాలని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ప్రతిపక్షాల అరెస్టులకు పోలీసులను అడ్డగోలుగా వాడుకొని, అవమానకర రీతిలో గౌతమ్ సవాంగ్ ను గెంటేశారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ రెడ్డి దుబారాతో లూటీ తో రాష్ట్రం ఆర్థికంగా దివాలా: యనమల
అడ్డు అదుపులేని అప్పులతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని పేర్కొన్న యనమల రామకృష్ణుడు ఆస్తులు తాకట్టు పెట్టి, భూములను అమ్మి భారీగా ఆదాయం సమకూర్చుకున్నారు అంటూ ఆరోపించారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉందని ఆయన అసహనం వ్యక్తం చేశారు.కరోనా ను బూచిగా చూపించి ఎడాపెడా అప్పులు చేస్తున్నారని యనమల మండిపడ్డారు. జగన్ రెడ్డి దుబారాతో లూటీ తో రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించాలని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 360 ప్రకారం రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీని విధించాలని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు.
గౌతమ్ సవాంగ్ బదిలీపై రాజకీయ దుమారం
గౌతమ్ సవాంగ్ కు బదిలీపై రాజకీయ పార్టీలు జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నాయి. గౌతమ్ సవాంగ్ ను అన్నా అని పిలిచి సీఎం జగన్ కరివేపాకులా వాడుకుని వదిలేశారని టీడీపీ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు . గౌతమ్ సవాంగ్ వ్యవహారం అధికారులకు గుణపాఠం కావాలని వర్ల రామయ్య హితవు పలికారు. ఇదిలా ఉంటే గౌతమ్ సవాంగ్ ను ఎందుకు బదిలీ చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఉద్యోగుల ర్యాలీ సక్సెస్ కావడంతోనే ఆయన పోస్టు ఊస్టింగ్ అయిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక తాజాగా గౌతమ్ సవాంగ్ కు బదిలీపై సిపిఐ నేత నారాయణ తన స్పందన తెలియజేశారు. గౌతమ్ సవాంగ్ కి తగిన శాస్తి జరిగిందని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు పాలకవర్గం ఏం చెప్తే అవి చేయాలని భావిస్తే ఇలాంటివే జరుగుతాయని సిపిఐ నారాయణ విమర్శించారు. గతంలో ఎల్ వి సుబ్రహ్మణ్యం జగన్ కి ఎంత మంచి చేశారో తెలుసు అని పేర్కొన్న నారాయణ పీవీ రమేష్ లాంటి వారిని కూడా అలాగే చేశారని వ్యాఖ్యానించారు.
Recommended Video
తప్పులు చేయడం మొదలుపెడితే ఒక్క మంచి పని చేసినా ఇలాగే ఉంటుంది
నిజాయితీగా పని చేసే వారి పట్ల ప్రభుత్వం గతంలో ఇలాగే వ్యవహరించిందని, ఇదే సమయంలో తప్పుల మీద తప్పులు చేసి, విధేయతను చూపించే వారిని కూడా బదిలీ చేసిందని పేర్కొన్నారు. ఈ బదిలీతో అయినా అధికారులకు కనువిప్పు కలగాలని సిపిఐ నారాయణ పేర్కొన్నారు. ఒకసారి తప్పులు చేయడం మొదలుపెడితే ఒక్క మంచి పని చేసినా ఇలాగే జరుగుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. అధికారులు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని, అలా చెయ్యలేము అని భావిస్తే పక్కకు జరగాలని సిపిఐ నారాయణ పేర్కొన్నారు.