మంత్రులకు విల్లాలు: ఆర్&బీ లెక్క అడుగుకు రూ.7, ప్రభుత్వం చెల్లించేది రూ.11
అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి కార్యాలయాల తరలింపు, ఉద్యోగులకు వసతులపై ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ఆర్ధిక మంత్రి యనమల మాట్లాడుతూ ఉద్యోగుల వసతిపైనే ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు.
మంత్రులు, ఉన్నతాధికారులకు 271 అపార్ట్మెంట్లు సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా ఉన్న రెయిన్ ట్రీ పార్కు అపార్ట్మెంట్లకు చదరపు అడుగుకు రూ. 11 చెల్లించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. కాగా ఆర్ అండ్ బీ లెక్క ప్రకారం అడుగుకు 7 రూపాయిలే ఉంది.

రెండు సంవత్సరాలకు ఒప్పందం చేసుకోగా, ఏటా 5 శాతం అద్దె పెంచేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పటికే హైదరాబాద్ లో నెలకు రూ.50వేలు చొప్పన ప్రభుత్వం అద్దె చెల్లిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందంతో మంత్రులు, ఉన్నతాధికారులకు వసతుల కల్పించడంతో ప్రభుత్వంపై అదనంగా రూ. 5.5 కోట్ల భారం పడుతుందని మంత్రి యనమల తెలిపారు.
ఏపీ రాజధానికి ప్రాంతానికి కార్యలయాల తరలింపు ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చూసుకుంటుందన్నారు. కమిటీ సభ్యులుగా ఐఏఎస్ అధికారులు జవహర్రెడ్డి, లవ్ అగర్వాల్, శ్యాంబాబు, జయలక్ష్మీ, హేమ మునివెంకటప్పలను కమిటీ సభ్యులుగా నియమించారు. రాజధాని ప్రాంతానికి ఉద్యోగుల తరలింపు ప్రక్రియను ఈ ఏడాదే పూర్తి చేయాలని ఈ కమిటీ భావిస్తోంది.
విభాగాల వారీగా ఉద్యోగులకు వసతి కల్పనను జవహార్ రెడ్డి కమిటీ చూసుకుంటుందని తెలిపారు. గన్నవరంలోని మేధా టవర్లో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు కొన్ని సాంకేతికి సమస్యలున్నాయని చెప్పారు. ఆ భవనం సెజ్ పరిధిలో ఉన్నందున డీనోటిఫై చేయాల్సి ఉందన్నారు.












Click it and Unblock the Notifications