ఏపీలో జగన్ క్యాబినెట్ మంత్రుల రాజీనామాల మతలబు ఇదే: మాజీ మంత్రి యనమల
ఏపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ మోహన్ రెడ్డి అవినీతి పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారు యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఇప్పుడు తన క్యాబినెట్ విధానంతో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సృష్టించబోతున్నారు అంటూ యనమల రామకృష్ణుడు అసహనం వ్యక్తం చేశారు.
జగన్ మంత్రుల నుండి రాజీనామాలు కోరిన కారణం చెప్పాలి
జగన్ సర్కార్ తమ పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు యనమల రామకృష్ణుడు. అందుకే మంత్రులను మార్చే నిర్ణయం తీసుకున్నారన్నారు. మంత్రుల నుండి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాజీనామాలు కోరారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కీలుబొమ్మ తరహాలో మంత్రివర్గాన్ని బలిపశువును చేస్తున్నట్టు కనిపిస్తోందని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి అవినీతి బురద కడుక్కోవాలి అంటే ఈ రాజీనామాలు సరిపోవని యనమల రామకృష్ణుడు అభిప్రాయపడ్డారు.
ప్రతిపక్షాన్ని మరింతగా బూతులు తిట్టే మంత్రి కావాలని జగన్ కేబినెట్లో మార్పులా?
సీఎం జగన్ తన విధ్వంస విధానాల వల్ల ఏపీ ని సర్వనాశనం చేస్తున్నారని యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. విధ్వంసకర పాలన చేస్తున్న సీఎం జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పి, ముఖ్యమంత్రి పదవి నుండి తక్షణం దిగిపోవాలని యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఇక సీఎం జగన్ క్యాబినెట్ లో మార్పులు చేర్పులపై అసహనం వ్యక్తం చేసిన యనమల రామకృష్ణుడు ప్రతిపక్షాన్ని మరింతగా బూతులు తిట్టే మంత్రి కావాలని జగన్ కేబినెట్లో మార్పులు చేర్పులు చేస్తున్నారా .. అంటూ మండిపడ్డారు.
క్యాబినెట్ కూర్పుతో జగన్ పదవీచ్యుతుడు కావడం ఖాయం
ఇప్పటి వరకు జగన్ తన అపరిపక్వ, అవినీతి పాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టారని , ప్రస్తుత క్యాబినెట్ కూర్పుతో జగన్ పదవీచ్యుతుడు కావడం ఖాయమని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజకీయ బురద, అవినీతి నుండి బయట పడేయడం కోసం క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ ఏ మాత్రం సహాయ పడదని యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. అసమర్థ పాలనతో ఆంధ్రప్రదేశ్ ను జగన్ అన్ని రకాలుగా సంక్షోభంలోకి నెట్టారు అని యనమల పేర్కొన్నారు.
ఏపీకి ఏ పారిశ్రామికవేత్త పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదు
మంత్రివర్గ విస్తరణ పేరుతో మంత్రులు అందరినీ మార్చేస్తే సమస్యలు సమసిపోతాయా అని ప్రశ్నించిన యనమల రామకృష్ణుడు ఇప్పుడు ఉన్న మంత్రులను మార్చవలసిన అవసరం ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. విద్యుత్ కోతలు, దోపిడి, దౌర్జన్యాల వల్ల ఏపీకి ఏ పారిశ్రామికవేత్త పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం లేదని యనమల రామకృష్ణుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికే పతనం అంచున ఉందని పేర్కొన్న ఆయన త్వరలోనే జగన్ దిగిపోవడం ఖాయమన్నారు.
సచివాలయాలలో నిధులు లాక్కోవటం దుర్మార్గం
ఇక అంతే కాదు వైసిపి ప్రభుత్వంలో గాంధీజీ కలలు కన్న గ్రామస్వరాజ్యం మిధ్యేనని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు విమర్శలు చేశారు. జగన్ చెబుతున్నదానికి చేస్తున్న దానికి ఏమాత్రం సారూప్యత లేదని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామని చెప్పిన జగన్ సచివాలయాల ను ఏర్పాటు చేశారని, ఇక ఇప్పుడు ఆ సచివాలయాల్లో నిధులు లాక్కోవడం దుర్మార్గమని యనమల మండిపడ్డారు. మూడేళ్ల కాలంలో పంచాయతీలకు కేటాయించిన 11 వేల కోట్ల విలువైన నిధులను అక్రమంగా మళ్ళించుకున్నారంటూ యనమల రామకృష్ణుడు ఆరోపణలు గుప్పించారు.