ఎక్కువ మంది పిల్లలు: బాబుకు యనమల బాసట
హైదరాబాద్: ఎక్కువ మంది పిల్లలను కనాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు సమర్థించారు. జనాభా సమతుల్యత ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఆ పిలుపు ఇచ్చారని ఆయన అన్నారు. భూకేటాయింపులపై మంత్రి వర్గ ఉపసంఘం భేటీ ముగిసిన తర్వాత ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలు కుటుంబ నియంత్రణ విధానాలపై పునరాలోచన చేస్తున్నాయని, జపాన్ మితిమీరిన కుటుంబ నియంత్రణ వల్ల పరిస్థితి గురించి ఆలోచిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్రంలో గడచిన పదేళ్లలో లక్ష ఎకరాలను అడ్డగోలుగా పరిశ్రమల పేరిట కేటాయించారని మంత్రులు కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు చెప్పారు.
నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా కేటాయింపులు జరిపిన వైనంపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని మంత్రులు చెప్పారు.. 571, 607 జోవోల రద్దు గురించి పరిశీలిస్తున్నామని వారు తెలిపారు. ఈ నెల 28వ తేదీన తిరిగి సమావేశమవుతామని వారు చెప్పారు.
పరిశ్రమలకు భూకేటాయింపులకు కొత్త విధానాన్ని రూపొందించే ఆలోచన చేస్తున్నట్లు వారు తెలిపారు. లీజు ప్రాతిపదికపై భూములను కేటాయించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. భూముల కేటాయింపు విషయంలో నిబంధనలను ఉల్లంఘించినవారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ల్యాండ్ ఆడిట్ కమిటీని ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించినట్లు తెలిపారు.