బాబు, లోకేష్ భుజం తట్టారు, ఆత్మపరిశీలన చేసుకోవడం అభినందనీయం: యరపతినేని
ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణపై పలువురు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం టీడీపీ అధిష్టానం, సీఎం చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలుస్తున్నారు.
అమరావతి: ఇటీవల జరిగిన మంత్రి వర్గ విస్తరణపై పలువురు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తుంటే.. మరికొందరు మాత్రం టీడీపీ అధిష్టానం, సీఎం చంద్రబాబునాయుడుకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా, గురజాల టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పార్టీ అధిష్టానం నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని అన్నారు.
మంత్రి కావాలని ఉంటుంది కానీ..
‘ఎమ్మెల్యేలుగా ఎన్నికయిన మాకు మంత్రి కావాలనుంటుంది.. అది తప్పు కాదు.. కానీ మన స్థాయి, అర్హతలు, పార్టీ ఇబ్బందులు, రాజకీయ అవసరాలు, పార్టీ భవిష్యత్తు లక్ష్యాలేమిటో కూడా చూసుకోవాలి కదా? పార్టీ లేకపోతే మనం లేమన్న విషయాన్ని అందరం గుర్తుంచుకుని, పార్టీని ఇబ్బందిపెట్టే ధోరణి మానుకోవాలి. మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు సమష్టిగా కృషి చేయడంపై దృష్టి సారిస్తే మంచిది'అని ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
ఆత్మపరిశీలన చేసుకోవడం అభినందనీయం
సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ తన భుజం తట్టడం ఆనందపరిచిందని యరపతినేని అన్నారు. ఇటీవల పార్టీలో కొందరు నేతల అసంతృప్తిని ఆయన వద్ద ఓ మీడియాప్రతినిధి ప్రస్తావించగా.. ‘పార్టీ నేతలు ఒక్కరోజులోనే ఆత్మపరిశీలన చేసుకుని మళ్లీ ఐక్యత ప్రదర్శించటం అభినందనీయమన్నారు. మా పార్టీ ఒక కుటుంబం లాంటిది. కుటుంబసభ్యుల ఆవేదనను మా కుటుంబపెద్ద విన్నారు. వాళ్లు కూడా తృప్తి చెందారు' అని యరపతినేని తెలిపారు.
అందుకే చంద్రబాబుకు..
పార్టీ ఉంటేనే మేమంతా బాగుంటామని, ప్రజలు కూడా అవినీతిపరుడైన జగన్ను సీఎం చేస్తే రాష్ట్రం నాశమవుతుందన్న భయంతోనే... పాలనలో అనుభవజ్ఞుడైన చంద్రబాబుకు పట్టం కట్టారని, అలాంటి బాబు తన ఆశయ సాధన కోసం నిమగ్నమైన సమయంలో ఆయనను ఇబ్బందిపెట్టడం మంచిదికాదని యరపతినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
ఎక్కడో ఉండేవాడిని...
‘పనిచేసిన వారికి అసంతృప్తి ఉండటం సహజమన్నారు. అసంతృప్తిపరుల ఆవేదనను తాను తప్పుపట్టడం లేదని, అయితే దాన్ని పార్టీ వేదికపై చర్చించాల్సి ఉంటుందన్నారు. నా వరకూ నేను ఎమ్మెల్యే కాకపోతే ఎక్కడో ఉండేవాడిని' అని యరపతినేని చెప్పుకొచ్చారు.
శిరసావహించాల్సిందే..
‘నేను ఈ స్థాయికి రావడానికి పార్టీనే కారణం. నా రాజకీయ జీవితం పార్టీ పెట్టిన భిక్ష. నా స్థాయి ఏమిటో నాకు తెలుసు. నాకు పదవి రాలేదని, చివరి నిమిషంలో చేజారిపోయిందన్న బాధేమీ లేదు. మరొకరికి అవకాశాలివ్వాలన్న పార్టీ నిర్ణయాన్ని శిరసావహించాల్సిన ధర్మం నాకుంది' అంటూ అధిష్టానం పట్ల తన విశ్వాసం చాటుకున్నారు యరపతినేని శ్రీనివాసరావు.