కడపలో టీడీపీ కార్యాలయానికి కేటాయించిన స్థలం రద్దు.. న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్న టీడీపీ
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ, టీడీపీ టార్గెట్ గా పని చేస్తుంది. చంద్రబాబుకు వరుస షాకులను ఇస్తుంది. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి తెలుగుదేశం పార్టీ ని టార్గెట్ చేసిన సర్కార్ ఎపీకి నాడు చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసిన రాజధాని కాకుండా మూడు రాజధానుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఇన్ సైడర్ ట్రేడింగ్ పేరుతో చేసిన అవినీతిని బట్టబయలు చేసేందుకు కంకణం కట్టుకుంది. ఇక అంతే కాదు తాజాగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం కడప జిల్లాలో కేటాయించిన భూమిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నదే తడవుగా అసెంబ్లీలో తీర్మానం చేసి మరీ టీడీపీకి కేటాయించిన భూమి రద్దు చేశారు.
ఏపీ ప్రభుత్వానికి మరో షాక్ ఇచ్చిన హైకోర్టు ..ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనపై కీలక వ్యాఖ్యలు
కడప టీడీపీ కార్యాలయ స్థలాన్ని రద్దు చేసిన వైసీపీ సర్కార్
సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో నిన్న టీడీపీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి గత ప్రభుత్వం కేటాయించిన భూ కేటాయింపును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నగరంలోని కడప, కర్నూలు జాతీయ రహదారిలోని జాతీయ రహదారుల కార్యాలయం ఆవరణలో ఉన్న స్థలాన్ని టీడీపీ కార్యాలయ నిర్మాణానికి ఇవ్వాల్సిందిగా అప్పట్లో జిల్లా పార్టీ దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం ఆర్అండ్బీకి చెందిన అక్కాయపల్లె సర్వేనెంబరు 37/4లో ఉన్న రెండు ఎకరాల స్థలాన్ని కేటాయించింది .
రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయ స్థలాలపై నజర్ పెట్టిన వైసీపీ
పార్టీ కార్యాలయ నిర్మాణానికి 33 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ 2019 జనవరి 24న జీవోఎంఎస్ నెంబరు 56ను జారీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.మూడేళ్లుగా సంవత్సరానికి రూ.వెయ్యి వంతు లీజు చెల్లించాలని మూడేళ్లలోపు నిర్మాణాలను చేపట్టాలంటూ కూడా పొజిషన్ ఇచ్చారు. రెండేళ్ల లీజును టీడీపీ నేతలు చెల్లించారు. అయితే ఆ స్థలాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది వైసీపీ సర్కార్. ఇక ఈ స్థలమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ కార్యాలయాలున్న స్థలాలను సైతం స్వాధీనం చేసుకోవాలని ఇప్పటికే ప్రయత్నాలు చేస్తుంది వైసీపీ.
కడప టీడీపీ ఆఫీస్ స్థల రద్దుపై సీరియస్ .. కోర్టుకు వెళ్తాం అంటున్న టీడీపీ నాయకులు
ఇక ఈ నేపధ్యంలో పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని సీఎం జగన్ సర్కారు రద్దు చేయడాన్ని టీడీపీ నేతలు సీరియస్ గా తీసుకున్నారు .రాజధానినే మార్చే వారికి స్థలాల రద్దు చేయడం పెద్ద విషయం కాదన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపోరాటం చేస్తామన్నారు.ఇది దుర్మార్గ ప్రభుత్వమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ నేతలు . కావాలని కక్ష సాధింపు చర్యలలో భాగంగా వైసీపీ ఈ విధంగా చేస్తుందని మండిపడుతున్నారు.