పంచాయితీలకు వైసీపీ రంగులు .. హైకోర్టులో విస్మయం కలిగించిన వాదన .. నేడు మళ్ళీ విచారణ
ఏపీలో పంచాయితీలకు వైసీపీ రంగులు వేయటంపై హైకోర్టులో దాఖలైన పిటీషన్ పై విచారణ జరిగిన విషయం తెలిసిందే . పంచాయతీ ఎన్నికలు వస్తున్నందున పార్టీ రంగులు కార్యాలయాలపై ఉండకూడదని , వాటిని తొలగించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. కార్యాలయాలకు రంగుల తొలగింపు వ్యవహారంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా బాధ్యత తీసుకోవాలని హైకోర్టు సూచించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్నికల సంఘానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది . ఇక ఫిబ్రవరి 5 న ఈ వ్యవహారంలో ప్రభుత్వం తరపు న్యాయవాది, అలాగీ ఎన్నికల కమీషన్ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు. ఇక ఈ నేపధ్యంలో హైకోర్టులో జరిగిన వాదన విస్మయం కలిగించింది .
పంచాయితీలకు వైసీపీ రంగులు తొలగించండి .. వైసీపీ సర్కార్ కు షాక్ ఇచ్చిన హైకోర్టు
పంచాయితీలకు వైసీపీ రంగులు పిటీషన్ పై హైకోర్టులో వాదన
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి ప్రభుత్వ భవనాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రంగులు వేస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. అవేమీ లెక్క చెయ్యకుండా వైసీపీ సర్కార్ పంచాయితీలకు , ఒక్క ప్రభుత్వ కార్యాలయాలకే కాదు ఏకంగా స్మశాన వాటికల గోడలకు, వాటర్ ట్యాంక్ లకు సైతం వైసీపీ రంగులేసింది. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులను వేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టులో నిన్న జరిగిన విచారణలో ఆసక్తికర వాదన వెలుగు చూసింది .
రంగులు మాత్రమే కాదు సీఎం ఫోటో ఎందుకు ముద్రించారని ప్రశ్నించిన హైకోర్టు
పంచాయతీ కార్యాలయాలు, ప్రభుత్వ భవనాలకు వేసిన రంగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి కాదని ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టులో పేర్కొన్నారు. దాంతో హైకోర్టు ధర్మాసనం షాక్ కు గురైంది. రంగులను తాము పోల్చుకోగలమని , టీడీపీ, వైసీపీ జెండా గుర్తులను కోర్టు ముందు ఉంచాలని ఆదేశించారు. పంచాయితీలపై రంగులను మాత్రమే కాదు, గ్రామ సచివాలయాలపై ముఖ్యమంత్రి ఫోటో ఉండటంపైనా హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పంచాయతీ ఆఫీసులపై సీఎం ఫోటో ఎందుకు ముద్రించారని ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం తరపు న్యాయవాది చెప్పిన సమాధానం కూడా విస్మయం కలిగించింది అని చెప్పక తప్పదు .
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారన్న న్యాయవాది .. ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నారు కాబట్టే ముద్రించారని చెప్పుకొచ్చారు న్యాయవాది . దీంతో ఆగ్రహం వ్యక్తం చేసింది కోర్టు ధర్మాసనం. ప్రభుత్వ న్యాయవాది అంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పటం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.అలా అయితే పార్లమెంటుపై ప్రధాని ఫోటో, సుప్రీంకోర్టుపై సీజేఐ ఫోటో ముద్రించారా అని మరోమారు ప్రశ్నల వర్షం కురిపించింది. రంగులు వేసే, ఫోటోలు పెట్టే ఇలాంటి సాంప్రదాయం ఎక్కడుందో చూపించాలని ఆదేశించింది. కార్యాలయాల లోపల పెట్టుకోవచ్చని చెప్పి దీనికి సంబంధించి మొత్తం వివరాలు సమర్పించాలని ఆదేశించింది కోర్టు ధర్మాసనం .
రంగుల తొలగింపుకు ప్రస్తుతం అధికారం లేదన్న ఎన్నికల కమీషన్ .. నేడు మరోమారు విచారణ
రంగుల తొలగింపుపై ఎన్నికల కమిషన్ తరపు న్యాయవాది కూడా వివరణ ఇచ్చారు.ప్రస్తుతం తాము ఎలాంటి చర్య తీసుకోలేమని చెప్పారు. ప్రస్తుతం ఇంకా ఎన్నికల ప్రకటన చేయలేదు కాబట్టి తమకు ఎలాంటి అధికారం లేదని వాదించారు. ఎన్నికల కమిషన్కు అధికారం లేనప్పుడు తామే నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. తిరిగి నేడు ఈ వ్యవహారంలో విచారణను కొనసాగించనుంది హైకోర్టు ధర్మాసనం .