చంద్రబాబు డిమాండ్స్ పై మండిపడుతున్న వైసీపీ .. కౌంటింగ్ టీడీపీ ఆఫీస్లో పెట్టమంటాడేమో అని సెటైర్లు
టీడీపీ అధినేత చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్ వెలువడిన తర్వాత రోజుకో డిమాండ్ చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. వీవీ ప్యాట్ స్లిప్పులను ముందు లెక్కించాలని , ఆ తరువాతే ఈవీఎంల లెక్కింపు జరపాలని చంద్రబాబు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాదు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలను చాలా వివాదాస్పదంగా తయారు చేసిందని ఈ రోజు ఢిల్లీ వేదికగా విపక్ష పార్టీలతో కలిసి ధర్నా చెయ్యాలని నిర్ణయించారు చంద్రబాబు . ఈ నేపధ్యంలో ఓటమి భయంలో ఉన్న చంద్రబాబు రోజుకో డిమాండ్ చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు.
ఎగ్జిట్ పోల్స్ తో మారిన జగన్ షెడ్యూల్ .. రేపు తాడేపల్లిలో అత్యంత ముఖ్య నాయకులతో సమావేశం .. అందుకే
ఎగ్జిట్ పోల్స్ చంద్రబాబుకు పొలిటికల్ ఎగ్జిట్ పోల్స్ అన్న వైసీపీ నేతలు
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత కన్నబాబు నిన్నటి ఎగ్జిట్ పోల్స్, చంద్రబాబుకు పొలిటికల్ ఎగ్జిట్ పోల్ అని వ్యాఖ్యానించారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో చంద్రబాబు కళ్లలో ఓటమి భయం కనిపిస్తోందని కన్నబాబు అన్నారు. అన్ని సర్వే సంస్థల నివేదికలు వైసీపీ గెలుస్తుందని చెబుతుంటే, లగడపాటి సర్వే మాత్రం అందుకు విరుద్ధంగా చెప్పిందని విమర్శించారు. ఇక ఈవీఎంలపై చంద్రబాబు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని చంద్రబాబు 2014 లో ఉపయోగించింది ఈవీఎంలు కాదా అని ఆయన ప్రశ్నించారు.
చంద్రబాబు డిమాండ్స్ పై అసహనం .. ఎన్నికల కౌంటింగ్ టీడీపీ కార్యాలయంలో పెట్టమంటారు కాబోలు అంటూ సెటైర్లు
టీడీపీ కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే లగడపాటి సర్వే రిలీజ్ చేశారని , తప్పుడు సర్వేలతో లగడపాటి ఏదో చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాడని కన్నబాబు మండిపడ్డారు. ఓటమి పాలవుతామన్న భయంతోనే ఈసీ ముందు రోజుకో డిమాండ్ ను చంద్రబాబు ఉంచుతున్నారని విమర్శించారు. చంద్రబాబు డిమాండ్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్న వైసీపీ నేతలు చంద్రబాబును చూస్తుంటే, ఎన్నికల కౌంటింగ్ టీడీపీ కార్యాలయంలో నిర్వహించమని ఈసీని డిమాండ్ చేస్తారేమో అనిపిస్తోంది అంటూ సెటైర్లు విసిరారు.
చంద్రబాబు భయంతోనే ప్రతీది రాద్దాంతం చేస్తున్నారు అంటున్న వైసీపీ నేతలు
ఇక వైసీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్ధసారథి వైసీపీ అధినేత జగన్ తొమ్మిదేళ్లుగా ప్రజల మధ్యే ఉంటున్నారని అన్నారు.ప్రజల కష్టాలు తెలుసుకున్న నేతకు జనం పట్టం కడతారని పేర్కొన్నారు. విజయవాడలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జగన్ తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టనష్టాలను తెలుసుకున్నారని, వారి కష్టాలను దగ్గర నుంచి చూశారని అన్నారు. ‘నవరత్నాలు'తో తమ బతుకులు బాగుపడతాయని భావించిన ప్రజలు జగన్ కు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని అనుకున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీకి మెజార్టీ విజయం లభిస్తుందని ప్రముఖ సర్వే సంస్థలు వెల్లడించాయని అన్నారు.వైసీపీ విజయం సాధిస్తుందనే చంద్రబాబు భయపడుతున్నారని, అందుకే ప్రతి విషయం రాద్దాంతం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.