జనసేనలోకి వైసీపీ సీనియర్ నేత - అదే బాటలో..!!
ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. ఎన్నికల్లో వైసీపీ ఓడటంతో ఆ పార్టీ నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు. అటు వరుస కార్యక్రమాల ద్వారా పార్టీ శ్రేణుల్లో విశ్వాసం నింపాలని జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో రాజధాని జిల్లా పరిధిలోని వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ వీడేందుకు సిద్దమయ్యారు. మద్దాలి గిరి పార్టీకి రాజీనామా చేయగా.. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే..తాజా ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్దిగా పోటీ చేసిన మరో నేత అదే బాట పట్టారు.
వైసీపీకి దూరం
గుంటూరు జిల్లాలో వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఎన్నికల్లో గుంటూరు జిల్లాలో వైసీపీ చిరునామా గల్లంతు అయింది. 2019లో ఇదే జిల్లాలో 15 స్థానాలు గెలిచిన వైసీపీ..తాజా ఎన్నికల్లో ఒక్క సీటు దక్కించుకోలేదు. పలు నియోజకవర్గాల్లో అభ్యర్దుల మార్పు..నియోజకవర్గాలను మార్చటం వంటి ప్రయోగాలు పూర్తిగా వికటించాయి. ఎన్నికల ఫలితాల తరువాత పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నేతలు పార్టీ వీడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన కొద్ది రోజుల్లోనే మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు పార్టీకి రాజీనామా చేసారు.

జనసేన వైపు చూపు
2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిచిన మద్దాలి గిరి తరువాత వైసీపీకి దగ్గరయ్యారు. ఇప్పుడు వైసీపీకి రాజీనామా చేసారు. తిరిగి టీడీపీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇక...ఇప్పుడు మరో నేత పార్టీ వీడేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వైసీపీలో జిల్లాకు చెందిన సీనియర్ పొలిటీషియన్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన అల్లుడు కిలారి రోశయ్య 2019లో పొన్నూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా వ్యవహరించారు.
ఆత్మీయ సమావేశం
తాజా ఎన్నికల్లో ఉమ్మారెడ్డి కుమారుడు వెంకట రమణను తొలుత గుంటూరు ఎంపీ అభ్యర్దిగా ప్రకటించారు. తరువాత రోశయ్యను గుంటూరు ఎంపీ అభ్యర్దిగా బరిలోకి దింపారు. రోశయ్య ఓటమి పాలయ్యారు. ఇప్పుడు మారిన రాజకీయ సమీకరణాలతో రోశయ్య జనసేనలో చేరేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. తన మద్దతు దారులతో రోశయ్య ఆత్మీయ సమావేశానికి నిర్ణయించారు. ఆ సమావేశంలో తన ఆలోచనలను వివరించి..వారి అభిప్రాయాలను సేకరించనున్నారు. ఈ భేటీలోనే జనసేనలో చేరిక పైన రోశయ్య ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.












Click it and Unblock the Notifications