ఏపీలో పోలీసులు వర్సెస్ వైసీపీ : వర్మపై దాడి కేసులో ఇద్దరిని కోర్టుకు తీసుకెళ్తుండగా గొడవ
అమరావతి : ఏపీలో పోలింగ్ జరిగిన రోజే ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఉప్పాడ పోలింగ్ కేంద్రం వద్ద ఎమ్మెల్యే వర్మపై దాడి చేసిన కేసుల్లో ఇద్దరిని పోలీసులు గుర్తించారు. వారిద్దరిని నిన్న అరెస్ట్ చేసి కోర్టుకు తరలించేందుకు తీసుకెళ్తుండగా వైసీపీ నేతలు, కార్యకర్తలు అడ్డుకోవడంతో కొత్తపల్లి పోలీసుస్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.
విడుదల చేయాలని డిమాండ్
గతనెల 11న ఏపీలో పోలింగ్ జరిగింది. ఆ సమయంలో ఎమ్మెల్యే వర్మపై కొందరు దాడి చేశారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇద్దరిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వారిని కోర్టుకు తరలిస్తుండగా వైసీపీ నేతలు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు.
లాఠీఛార్జీ .. రాళ్లతో దాడి ...
పరిస్థితి చేయిదాటిపోవడంతో పోలీసులు లాఠీలకు పనిచేశారు. లాఠీచార్జీ చేయడంతో .. ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసుస్టేషన్ పై రాళ్లతో దాడి చేశారు. దీంతో పోలీసులకు గాయాలయ్యాయి. కాకినాడ త్రీ టౌన్ కానిస్టేబుల్ సత్యనారాయణ మూర్తి సహా మరో ఇద్దరు మహిళలు గాయపడ్డారు. గాయపడ్డవారిని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మరో నలుగురి అరెస్ట్ ...
రాళ్లతో దాడిచేసిన నలుగురిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు. ఇటు ఎమ్మెల్యేపై దాడి కేసులో అరెస్ట్ చేసిన ఇద్దరిని పీఠాపురం కోర్టుకు తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు.